హెచ్పీఎస్లో సన్మానానికి యాజమాన్యం సన్నాహాలు?
ఆయనతో భేటీకి పలువురు పూర్వవిద్యార్థుల యత్నాలు
హైదరాబాద్ : విశ్వవిఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం, హైదరాబాద్ ఐకాన్ సత్య నాదెళ్లకు భాగ్యనగరంలో ఆత్మీయ స్వాగతం లభించింది. మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులైన దాదాపు 8 నెలల తర్యాత ఆదివారం సొంతగడ్డపై అడుగుపెట్టిన ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్వమిత్రులు, గతంలో ఆయనతోపాటు చదువుకున్న సహచర విద్యార్థులు, శ్రేయోభిలాషులు ఆయనకు సాదర స్వాగతం పలికేందుకు శతవిధాలా ప్రయత్నించడం విశేషం. బంజారాహిల్స్లోని సాగర్ సొసైటీలోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయన్ని వారంతా ప్రత్యేకంగా కలిసేందుకు ప్రయత్నించారు. కాగా సత్య నాదెళ్ల రాక పట్ల ఆయన విద్యాభ్యాసం చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, యాజమాన్యం, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అసాధారణ స్థాయిలో ఎదిగిన సత్యను అభినందించడానికి పూర్వ విద్యార్థులు, యాజమాన్యం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
తెలుగుజాతికే కాకుండా మెత్తం దేశానికే స్ఫూర్తిగా నిలిచిన సత్యను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించడానికి కృషి చేయాలని పాఠశాల బోర్డు సెక్రటరీ ఫయాజ్ఖాన్, సత్యకు పాఠాలు చెప్పిన జయానంద్ మాస్టర్, సత్య క్లాస్మేట్ ఫణి, బోర్డ్ సభ్యుడు ఆదిత్యారెడ్డి తదితరులు అభిప్రాయపడ్డారు. ఆయనకు పాఠాలు బోధించిన రిటైర్డ్ బోటనీ ఉపాధ్యాయుడు జయానంద్ మాస్టర్, సహాధ్యాయి ఫణి తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
సత్య సన్మానానికి ఏర్పాట్లు
సత్యకు బేగంపేట్ హెచ్పీఎస్ స్కూల్లో సన్మానం చేయడానికి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సత్య ఆమోదం కొసం ఎదురుచూస్తోంది. తీరికలేని కార్యక్రమాలతో బిజీగా ఉన్న సత్య ఆదివారం రాత్రి వరకు సన్మానం విషయమై ఇంకా ఏమీ తేల్చలేదని సమాచారం. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే వచ్చే డిసెంబర్లో నగరానికి వస్తానని, అప్పుడు పాఠశాలను సందర్శిస్తానని సత్య యాజమాన్యంతో పేర్కొన్నట్లు సమాచారం.
మీడియాకు దూరం.. దూరం..
సత్య నాదెళ్ల తల్లిదండ్రులు నివసిస్తున్న బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఆదివారం ఎలాంటి హడావుడి కనిపించలేదు. కొందరు సమీప బంధువులు, మిత్రులు ఆయనను ప్రత్యేకంగా కలసి వెళ్లినట్లు తెలిసింది. ఆయన కుటుంబ సభ్యులు, సత్యనాదెళ్ల మీడియాకు దూరంగానే ఉన్నారు. ఆయున రాక, పర్యటన విశేషాలను మీడియాకు తెలిపేందుకు ఆయన సహాయకులు, బంధువులు సైతం నిరాకరించారు. కాగా సోమవారం ఆయన మాదాపూర్లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది. మరికొందరు మిత్రులు, శ్రేయోభిలాషులకు సైతం వేర్వేరుగా అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.
కలివిడిగా ఉండేవాడు
సత్య చక్కటి అవగాహన, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. పాఠాలు శ్రద్ధగా వినేవాడు. కలివిడిగా ఉండేవాడు. వాళ్లనాన్న ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా ఎలాంటి గర్వం ఉండేది కాదు. క్రికెట్ బాగా ఆడేవాడు. ఎవరితో గొడవ పడేవాడుకాదు. నాకు ఎంతో ఇష్టమైన విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది.
- జయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, హెచ్పీఎస్
టెక్నాలజీపై మక్కువ ఎక్కువ
నాకు సెవెన్త నుంచి 12వ తరగతి వరకు సత్య క్లాస్మేట్. అప్పట్లోనే అతను టెక్నాలజీపై మక్కువ చూపేవాడు. చిన్న చిన్న గొడవలు, గిల్లికజ్జాలు కూడా పెట్టుకున్నట్లు గుర్తులేదు. చాలా సాధారణ విద్యార్థి. 12వ తరగతి పూర్తి అయిన తర్యాత ఇద్దరం కలిసింది తక్కువే అని చెప్పాలి. నేను కొన్ని నెలల క్రితం వరకు మైక్రోసాఫ్ట్ సంస్థలో అకడమిక్స్ డెరైక్టర్గా పనిచేశాను. వృత్తిలో భాగంగా తరచూ కలుస్తుండేవాడిని.
- ఫణి, సత్య క్లాస్మేట్ (1984బ్యాచ్)