లింగాలో త్రిపాత్రాభినయం!
Updated : 10/20/2014 1:55:24 AM
Views : 187
రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో ఒక్కసారిగా సందడి మొదలవుతుంది. తమ ఆరాధ్య కథానాయకుడిని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వారి అంచనాలకు తగినట్లుగానే కథాంశాల పరంగా వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ అభిమానుల్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. ముల్లా పెరియార్ డ్యామ్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయింది. ప్రస్తుతం రజనీకాంత్, సోనాక్షిసిన్హా పై హైదరాబాద్లో ఓ యుగళగీతాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది. ఓ శక్తివంతమైన నాయకుడు, డ్యామ్ ఇంజనీర్ పాత్రలతో పాటు మరో ఆసక్తికరమైన పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నట్లు తెలిసింది.
కథానుగుణంగా కీలకమైన సందర్భంలో వచ్చే పాత్ర ఇదని, సినిమాలో దీని నిడివి తక్కువగా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ పరిచయ గీతం మాత్రమే బ్యాలెన్స్గా వుంది. ఈ గీతాన్ని త్వరలో యూరప్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన రజనీకాంత్ కేవలం 24 గంటల్లోనే దానిని పూర్తిచేయడం గమనార్హం. డిసెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
No comments:
Post a Comment