|
త్రివిక్రమ్ సినిమాలంటే ఎంచక్కా ఇంటిల్లి పాది చూడొచ్చు అనే పేరు సంపాదించుకున్నాడాయన... త్రివిక్రమ్ - మహేశ్, పవన్ ఇద్దరికీ మంచి మిత్రుడు... ఆ స్నేహబంధంతోనే ఆ ఇద్దరు హీరోలతో రెండేసి చిత్రాలు రూపొందించాడు త్రివిక్రమ్... ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'జల్సా'... పవన్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందిన 'జల్సా' చిత్రంలో మహేశ్ బాబు వ్యాఖ్యానం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది... ఈ సినిమా సాధించిన విజయంలో మహేశ్ వాయిస్ కు కూడా భాగముందని వేరే చెప్పనక్కరలేదు... అలాంటి ఈ ముగ్గురు కలసి మరోమారు ఓ చిత్రానికి పనిచేయబోతున్నారంటే వారి అభిమానుల ఆనందం అంబరమంటక మానదు... పవన్, మహేశ్ ఇద్దరినీ హీరోలుగా పెట్టి త్రివిక్రమ్ 'కోబలి' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు విశేషంగా వినిపిస్తోంది... మహేశ్ తో 'అతడు, ఖలేజా' తీసిన త్రివిక్రమ్ ఇప్పుడు మూడో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు... అలాగే పవన్ తో 'జల్సా, అత్తారింటికి దారేది' సినిమాలు రూపొందించిన త్రివిక్రమ్ ఆయనతోనూ మరో సినిమా చేయాలని సంకల్పించాడు... ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలను కలిపి ఒకే చిత్రంలో నటింప చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన త్రివిక్రమ్ కు కలిగిందని, వారి కోసమే 'కో బలి' అనే కథను సిద్ధం చేసుకున్నారనీ వినికిడి... ప్రస్తుతం 'శ్రీమంతుడు'తో బిజీగా ఉన్న మహేశ్ ఆ సినిమా తరువాత 'బ్రహ్మోత్సవం'లో నటించనున్నాడు... ఇక పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'గబ్బర్ సింగ్-2' కూడా ఈ మధ్యే ఆరంభమయింది... అంటే ఇద్దరు హీరోలు తమ కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు... కాబట్టి వారిద్దరి సినిమాలు పూర్తయ్యే దాకా త్రివిక్రమ్ వేచి ఉండాల్సిందే... పవన్ 'గబ్బర్ సింగ్-2' పూర్తయ్యాక, దాసరి నిర్మించే చిత్రంలో నటించాల్సి ఉంది... మరి త్రివిక్రమ్ ఈ ఇద్దరు హీరోలతో తెరకెక్కించాలనుకుంటున్న 'కోబలి'కి నిర్మాత ఎవరవుతారో, ఎప్పుడు మొదలవుతుందో చూడాలి...
|
No comments:
Post a Comment