క్యాష్ లెస్ దిశగా.. ముందడుగు
29-11-2016
- బ్యాంకు ద్వారానే లావాదేవీలు
- ముందు చేసిన వారికే లాభం
- బిత్తరపోయి భయపడే పనిలేదు
- ప్రభుత్వం మీ వెంట ఉంటుంది
- ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు
- త్వరలో టీఎస్ వాలెట్.. ఐఏఎస్లతో టాస్క్ఫోర్స్
- కార్మికుల ఉపాధికి డబుల్ నిర్మాణాలు వేగవంతం
- బ్యాంకుల సామర్థ్యం పెంచాలని ప్రధానికి చెప్పా
- కేంద్రం నిర్ణయంతో నల్ల ధనం సమూల ప్రక్షాళన
- అయినా, గుడ్డిగా వ్యతిరేకించం..సమర్థించం
- ప్రధానితో చర్చించిన స్కీమ్ తెలిస్తే సన్నాసులు గుండెపగిలి చస్తారు
- ప్రజల్లో చైతన్యం తెద్దాం
- ఖాతాలు తెరిపిద్దాం.. క్యాష్లెస్ ప్రోత్సహిద్దాం
- ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు
- అయినా పరిష్కార బాధ్యత మనపైనే ఉంది
- కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
త్వరలో టీఎస్ వాలెట్ యాప్
ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్ వివరించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిల్లోనూ టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. త్వరలోనే ‘టీఎస్ వాలెట్’ విడుదల చేయనున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఐటీ విభాగం దీనిని రూపకల్పన చేస్తోందని, రెండు మూడు రోజుల్లోనే ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక, సురేశ్ చంద్ర చైర్మన్గా రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ఫోర్స్ వేశాం. వీళ్లు ఈరోజు సమావేశమయ్యారు. కేబినెట్కు ఒక నోట్ కూడా సమర్పించారు. అనేక సూచనలు చేశారు. వాటి ప్రకారం, రిజిసే్ట్రషన్లు, ఎక్సైజ్ తదితర శాఖల్లో లావాదేవీలు నెట్ బ్యాంకింగ్ ద్వారా జరగాలి. రిజిసే్ట్రషన్ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు పెట్టి రిజిసే్ట్రషన్లు చేయాలి. వ్యాట్ డీలర్లు, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర స్వైపింగ్ మిషన్లు పెట్టాలి. రైతులకు చెల్లింపులు చేసే అన్ని మార్కెట్ యార్డుల్లోనూ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరపడానికి మార్గాలు అన్వేషించాలి. చౌక ధరల దుకాణాలు కూడా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరపాలి. పాల సరఫరా, సివిల్ సప్లయిస్ కూడా బ్యాంకు పేమెంట్లను అనుమతించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎక్కువగా మొబైల్, ఈ అకౌంట్స్ దిశగా మార్పించాలి. ఇటువంటివన్నీ చేస్తూనే, బ్యాంకు అకౌంట్లు ఉన్న ఖాతాదారులు వాటి ద్వారానే లావాదేవీలు జరిపేలా మానసికంగా సిద్ధం చేయాలి. అకౌంట్లు లేనివాళ్లకు ఖాతాలు తెరిపించి బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయించాలి’’ అని వివరించారు.
బ్యాంకుల సామర్థ్యం సరిపోదు
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కూలీలను ఆన్లైన్ ద్వారానే చెలిస్తున్నామని, ఆసరా పింఛన్లలో అత్యధికం ఆన్లైన్లోనే చెల్లిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, వాటిలో 27 లక్షల పింఛన్లు బ్యాంకులోనే జమ చేస్తున్నామని, వికలాంగులకు 3లక్షలు మాత్రమే నేరుగా ఇస్తున్నామని తెలిపారు. ఇక, తెలంగాణలో 82 లక్షల జన్ధన్ ఖాతాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే చాలా వరకు బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నామని, నగదు రహిత విధానం అమలుకు ప్రభుత్వం ఉద్దేశించిన కార్యక్రమాలు చేపడితే బ్యాంకుల సామర్థ్యం సరిపోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధానికి స్పష్టం చేశానని తెలిపారు. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థ చాలా విస్తృతంగా విస్తరించాలి. ఉదాహరణకు, తెలంగాణలో అన్ని బ్యాంకులూ కలుపుకొని 5200 బ్రాంచీలు ఉన్నాయి. ఇవి సరిపోవు. ప్రతి మూడు నాలుగు గ్రామాల మధ్య ఒక బ్యాంకు బ్రాంచి, 1000-1500 జనాభా దాటిన ప్రతి ఊళ్లో ఒక ఏటీఎం ఉండేలా చూడాలి. ఇందుకు ప్రధాని కూడా అంగీకరించారు’’ అని కేసీఆర్ తెలిపారు. అలాగే, కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుసంధానినికి ఇద్దరు ముగ్గురు అధికారులను నియమిస్తున్నామని వెల్లడించారు. జిల్లా స్థాయుల్లోనూ టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా, డిసెంబరు 5, 6 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, జిల్లా స్థాయిలో అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీ వేస్తున్నామని తెలిపారు.
ఇక రెండే టాక్సులు
దేశవ్యాప్తంగా ఇకముందు రెండే రెండు పన్నులు ఉండనున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వాటిలో ఒకటి జీఎ్సటీ, రెండోది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్ (బీటీటీ) అని తెలిపారు. ‘‘పన్నుల విధానం సమగ్రంగా మారుతుంది. ఈ పథకం చివరకు ఎలా ఉంటుందంటే, నగదు విత డ్రాయల్స్ మీద ఆంక్షలు పెడతారు. పూర్తిగా బ్యాంకు లావాదేవీలు చేయమంటారు. చెక్కులు, మొబైల్ యాప్లు తదితరాల ద్వారా క్యాష్లెస్ లావాదేవీలు చేయాలని చెబుతారు. ఇది ముందు మనకు అయోమయంగా కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ వచ్చిన రోజు ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు పశువుల కాపరి కూడా మంచిగా ఫోన్ మాట్లాడుతున్నాడు. కూలీలు కూడా ఎస్ఎంఎ్సలు చేస్తున్నారు. అలాగే, మార్పు వస్తుంది. బీటీటీ నామమాత్రంగా ఉంటది. లావాదేవీల్లో దాదాపు ఒక శాతం ఇది ఉండవచ్చు. దానివల్ల ఆదాయం ఐదు రెట్లు పెరుగుతుంది. పన్ను ఆదాయంలో 42 శాతం రాషా్ట్రలకు ఇస్తరు. ప్రస్తుతం కేంద్రం ఏటా రూ.13 వేల కోట్లలో హెచ్చుతగ్గులుంటాయి. నెలకు రూ.997 కోట్లు వస్తాయి. చివరికి, రాషా్ట్రనికి వచ్చే ఆదాయం ఐదింతలు పెరుగుతుంది’’ అని కేసీఆర్ తెలిపారు.
గుడ్డిగా వ్యతిరేకించం.. గుడ్డిగా సమర్థించం
పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించం, గుడ్డిగా వ్యతిరేకించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘నల్ల ధనం మొత్తం తీసేసి, పరిశుభ్ర, అవినీతి రహిత దేశాన్ని తయారు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో రాష్ట్రాలకు పాత్ర లేదు. అమల్లో కూడా. అమల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు ప్రధానికి కొన్ని సూచనలు ఇచ్చాను. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వేసిన అడుగు ద్వారా నల్ల ధనం ఎన్ని రూపాల్లో ఉందో అన్ని రూపాల్లోనూ దానిని సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది. దీనిని ‘సంపూర్ణ ప్రక్షాళన’ అంటారు. అంతే తప్ప, ఏదో చక్కిలిగింతలు పెట్టి వదిలేసేది కాదు. కరెన్సీ రద్దు వెనక ఒక వ్యూహం ఉందనుకోను. దేశాన్ని గోల్మాల్ చేస్తున్నారని అనుకోను. 2 వేల నోటు కూడా రద్దు కావొచ్చు. కేంద్రం కరెన్సీ రద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. వేరే ఉద్దేశాలు ఉంటే ఇంత పెద్ద దేశంలో నియంతలను ప్రజలే కొట్టి చంపుతారు. ఇందిరాగాంధీకే జరిగింది’’ అని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశంలోని రాజకీయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
స్కీమ్ తెలిస్తే సన్నాసులు గుండెలు పగిలి చస్తారు
కరెన్సీ రద్దుపై ప్రధాన మంత్రితో చర్చించిన స్కీమ్ గురించి తెలిస్తే.. విమర్శలు చేసే సన్నాసులు గుండెలు పగిలి చస్తారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రధానితో చీకటి... వెలుగు ఒప్పందం ఏందీ? నాయకుల విమర్శలు చూస్తే బాధ కలుగుతోంది. నల్ల డబ్బుపై తెలంగాణ ప్రభుత్వం నడిచిందా అని కిషన్రెడ్డి మాట్లాడతడు. తెలంగాణే కాదు. ఈనెల 8వ తేదీ దాకా కేంద్రమే నల్లడబ్బుపై నడిచింది. దేశంలో నల్లఽధనాన్ని తెచ్చి... పోషించింది కాంగ్రెస్ పార్టీ... దేశాన్ని భ్రష్టు పట్టించింది కాంగ్రెస్సే... వీళ్లా మాట్లాడేది’’ అని మండిపడ్డారు.
డబుల్.. ఇక డబుల్ స్పీడ్
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఎక్కువగా, సత్వరమే ప్రభావం చూపేది నిర్మాణ రంగంపైనేనని, అందుకే, నిర్మాణరంగ కూలీలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్ వివరించారు. ‘కూలీలకు పని కల్పించడానికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించాం. వాటికి మన దగ్గర 5000 కోట్ల నిధులు మిగులు ఉన్నాయి. అందుకే స్పీడప్ చేయాలని కేబినెట్లో మేజర్ నిర్ణయం తీసుకున్నాం’’ అని కేసీఆర్ వెల్లడించారు. అలాగే, నగదు రహిత విధానంతో పేదలు ఇబ్బంది పడకుండా రూ.5 భోజన కేంద్రాల సంఖ్యను మూడు రెట్లు పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 50 కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా 15 వేల మందికి ప్రతి రోజూ భోజనం పెడుతున్నామని, ఇప్పుడు వాటి సంఖ్యను 150కు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. దాంతో, ఇక రోజూ 45వేల మందికి భోజనం అందుతుందన్నారు.
డిసెంబరులో అసెంబ్లీ
డిసెంబరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేసీఆర్ చెప్పారు. వర్షాకాల సమావేశం ఒకటే రోజు జరగడంతో వర్షా-శీతాకాల సమావేశాలు కలుపుకొని డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
మోడల్గా సిద్దిపేట
‘నగదు రహిత నియోజకవర్గంగా సిద్దిపేటను మార్చనున్నాం. అక్కడ ప్రయోగాత్మకంగా అమలుచేనున్నాం. మూడు మండలాలు, ఏ-క్లాస్ మున్సిపాల్టీ ఉంది. 100శాతం క్యాష్లె్సగా మార్చుతాం. 15రోజుల్లో ఏర్పాట్లుచేస్తాం. బ్యాంకులన్నీ సహకారం అందించడానికి ముందుకొచ్చాయి. వీలైనంతా తొందరగా నగదు రహిత సేవలు అంందిస్తాం. తొలిదశలో రూ.500లకు అనుమతించి ఆ తర్వాత జీరో కరెన్సీ దిశగా అడుగులుంటాయి. గుజరాతలోని అకోదరా అనే గ్రామమే దీనికి స్ఫూర్తి. 200 కుటుంబాలుండే ఆ గ్రామంలో రూ.200 నగదు మాత్రమే అనుమతిస్తున్నారు’ అని గుర్తు చేశారు.
రాజీవ్శర్మకు ఘనంగా సన్మానం
నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న తెలంగాణ తొలి సీఎస్ రాజీవ్శర్మను మంత్రివర్గ సమావేశంలో ఘనంగా సన్మానించి... వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలోనూ... రాష్ట్రం ఏర్పాటయ్యాకా రాజీవ్శ ర్మ అందించిన సేవలను మంత్రులు, సీఎం కొనియాడారు. పదవీ విరమణ కాగానే ఆయన్ను ప్రత్యేక సలహాదారుగా నియమించడానికి వీలుగా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. రేపటితో రాజీవ్శర్మ పదవీ కాలం ముగియనుంది.
స్వైపింగ్ మిషన్లూ సరిపోవు
నగదు రహిత తెలంగాణ ఆవిష్కారానికి ఇప్పుడు ఉన్న స్వైపింగ్ మిషన్లు కూడా సరిపోవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా పెంచాలని చెప్పారు. ‘‘మనది ఇన్ఫార్మల్ మార్కెట్. ఓ కుటుంబంలో నలుగురు ఉన్నారు. వాళ్లకు భోజనం తర్వాత అరటిపండు తినే అలవాటు ఉందనుకోండి. వాళ్లు రెండు పళ్లు తింటారు. అంటే, అరడజను పళ్లు కొనుక్కుంటారు. ఆరు అరటి పళ్లు కొనే కుటుంబం చెక్కు ఇచ్చి కొనే దేశం మనది కాదు. చెక్కు ఇచ్చి చేపలు కొనుక్కునేవాళ్లు నాకు ఎవరూ కనిపించలేదు. కూరగాయల మార్కెట్లోనూ అంతే. మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా నగదు ఆర్థిక వ్యవస్థ. అందుకే, దేశవ్యాప్తంగా 14.5 లక్షల స్వైపింగ్ మిషన్లు ఉంటే, ఒక్క తెలంగాణలోనే 85 వేల నుంచి లక్ష వరకూ ఉన్నాయి. వీటిలోనే 70 శాతం జీహెచ్ఎంసీలోనూ, ఇతర మున్సిపాల్టీల్లోనే. మండల కేంద్రాల్లో ఉన్నవి 20-25 శాతమే. అందుకే, రాష్ట్రానికి చాలినన్ని స్వైపింగ్ మిషన్లు కావాలి’’ అని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment