శివుడి యొక్క శరీరం మాతృకా విగ్రహం. ఓంకార స్వరూపుడు గనుక ఓంకారం సర్వాక్షరముల మూలము కదా! అందుకే "ప్రాణానల సంయోగముచే ప్రణవ నాదము సప్తస్వరములై పరగే" అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఆ దివ్యనాదము. ప్రణవ నాదము సప్త స్వరములుగా వచ్చింది. ఆ ప్రణవ నాదమునుంచే అయిదు ప్రధానమైన అవయవముల నుంచి ఒక్కొక్క దాని నుంచి పది చొప్పున యాభై అక్షరములు వచ్చాయి. ఓంకారం నుంచే యాభై అక్షరములు ఉత్పన్నమయ్యాయి. ఓంకారమే శివునియొక్క అసలు స్వరూపం. అందుకే "తస్య వాచక ప్రణవః వాచ్య శ్శివః వాచ్య వాచకరో వాచ్య వాచకయో రత్యంత భేదా భావః " అని శాస్త్రం చెప్తున్నది. ఆయనకి వాచకం ప్రణవం, వాచకం అంటే తెలియజేసేది. ఆయనని తెలియజేసేది ప్రణవం. ప్రణయం ద్వారా తెలియబడే వాడు ఆయన. తెలియబడే దానిని వాచ్యం అంటారు. తెలియజేసే దానిని వాచకం అని అంటారు. కనుక తెలియజేసేటటువంటి వాచకం ప్రణవం, తెలియబడేవాడు పరమేశ్వరుడు. ఈ రెండింటికీ అత్యంత భేదాభావః. వీటికి అంత భేదము లేదు అన్నాడు. అంత భేదం లేదు అంటే కొంత ఉంది అని అర్థమా? ఉంది. ఎందుకంటే ఓంకారం వ్యక్తమౌతోంది. వ్యక్తమవుతున్న ఇది ఎవరిని చెప్తోంది? అవ్యక్తమౌతున్న ఆయన గురించి చెప్తోంది. కనుక వ్యక్తమైన ఓంకారం క్రమంగా ఆయనని తెలియజేస్తోంది. కనుక ఇక్కడ హిందూమతంలో పుట్టిన మనందరం ఏమిటి తెలుసుకోవాలి అంటే మనందరం ఉపాసించేది ఓంకార స్వరూపుడైన ఒకే పరమేశ్వరుడిని. ఆయననే ఏ దేవతా రూపంలోనైనా మనం ఆరాధిస్తున్నాం. అందుకే ఏ దేవతకైనా ఓంకారంతోనే మనం మంత్రం చేస్తాం. కనుక మనం ఏక దేవతోపాసకులమే. మనందరం ఏకేశ్వర ఉపాసకులం. ఆ ఏకేశ్వరుడు, పరమేశ్వరుడు, సదాశివుడు ఆయన. ఆ ఏకేశ్వరుడినే నారాయణా అన్నా ఏది అన్నా. అందుకే ఏ మంత్రం చెప్పినా ముందు ఓంకారం లేనిదే మంత్రమే లేదు కదా! ఓంకారం ప్రథమంలో చెప్తున్నామా? లేదా? కనుక ఓంకారోపాసకులం మనందరం. మనందరికీ కలిపి ఒక మంత్రం ఏది అంటే ఓంకారమే. ఆ ఓంకారాన్ని మన ఇష్టదేవతా మంత్రములతో అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేయడం వల్ల అర్థం ఏమిటి? ఆ ఓంకార తత్త్వాన్నే ఈ దేవతా రూపంలో ఆరాధిస్తున్నామనే. అర్థం మరేమిటో కాదండి. అందుకు ఈ విషయాన్ని మనం గ్రహించాలి. పురాణములన్నీ సమన్వయముతో అందంగా కనిపిస్తాయి. ఆ సమన్వయ సూత్రం తెలిస్తే అన్ని పురాణాలు ఒక్క పురాణంలోనే మనం చూడవచ్చు
--------------------------------------------------------------------------------------...
చాగంటి కోటేశ్వర రావు గారు బాగున్నారా
.
No comments:
Post a Comment