మెదక్ చర్చి శాంతి స్వరూపం
కరువు కాలంలో ఆకలి తీర్చిన అద్భుత కట్టడం
నిర్మాణంలో తెలంగాణ కూలీలదే కీలక పాత్ర
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి
క్రిస్మస్ రాకతో కళకళలాడుతున్న మెదక్ చర్చి
మెదక్, డిసెంబర్ 20 (టీ మీడియా): నిజాం పాలనలో కరువు రక్కసి తాండవిస్తున్న తరుణం...ఆకలి కేకలతో ప్రజలు విలవిలాడుతున్న రోజులవి...ఇంగ్లాండ్కు చెందిన పాస్నెట్ దొరకు ఈ ప్రాంతంలోని కరువును చూసి గుండె కరిగింది. చిల్లిగవ్వ లేకున్నా తెలంగాణ ప్రాంత ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టి ఆదుకోవాలన్న సంకల్పంతో పనికి ఆహార పథకం కింద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈక్రమంలోనే పనికి ఆహార పథకం కింద 1914నుంచి 1924సంవత్సర కాలంలో చార్లెస్ వాకర్ పాస్నెట్ చేతిలో అత్యద్భుత నిర్మాణం ఏర్పాటైంది. ఇది ఆసియా ఖండంలోనే ఉన్నతంగా నిలిచింది. తెలంగాణ కూలీలు ఈ చర్చి అద్భుత నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. క్రైస్తవులకు పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి విరాజిల్లుతోంది. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద దేవాలయం. ఈ అద్భుత నిర్మాణం తెలంగాణకే గర్వకారణం. ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించే పుణ్యస్థలంగా, మత సామరస్యానికి ప్రతీకగా మెదక్ చర్చి నిలిచింది. అద్భుత కట్టడాల్లో ఒకటిగా దీనికి పేరుంది.
1879లో ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన వెస్లియన్ మెథడిస్టు మిషన్ వారు మెదక్ ప్రాంతంలో మిషనరీ కార్యక్రమాలు ప్రారంభించారు. చార్లెస్ వాకర్ పాస్నెట్ చేతిలో రూపుదిద్దుకున్న అద్భుత సృష్టి కేథడ్రల్ చర్చి 1914నుంచి 1924వరకు నిర్మాణం జరుపుకుంది. దక్షిణ, తూర్పు ఆసియా ఖండాల్లో ఈ కేథడ్రల్ చర్చి మహోన్నతమైంది. ఇంగ్లాండ్లోని రన్కోడ్ పట్టణానికి చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ అద్భుత నిర్మాణానికి పూనుకున్నారు. చర్చి నిర్మాణంలో పాస్నెట్ సాధించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
నిత్యనూతన ప్రయోగాలతో కట్టడంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. మెదక్ పట్టణ నడిబొడ్డున రూపుదిద్దుకున్న ఈ చర్చి అంబర చుంబి, ఉక్కు ఆకాశహర్మ్యంగా ప్రఖ్యాత రచయితలు ప్రశంసించారు. 55మీటర్ల ఎత్తు గల ఈ మహా స్థూపం ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఆసియా ఖండంలోనే ఎత్తైన చర్చిగా మెదక్ చర్చి రెండోదిగా ప్రసిద్ధికెక్కింది. అయితే నిర్మాణ సమయంలో అవసరాలకు తగ్గటుగా నిపుణులు, పనివారు లభించక నిర్మాణ సంస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాలంలో నిపుణులు కానీ, పనివారితో కానీ సత్వరంగా పని చేయించడంలో ఉద్యుక్తుడైన రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ త్వరలోనే సఫలీకృతుడయ్యాడు.
ఉక్కును గురించి సాంకేతిక వివరాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్మాణ సంస్థల్లో ఎప్పటికప్పుడు పనిని కొనసాగించే విధానాన్ని అమలుపరిచాడు. తయారు చేసిన భాగాలను కేవలం బిగించి పనిచేయడం అనే నూతన ప్రక్రియతో ఇండియాలోనే మొదటిసారిగా ఈ చర్చి నిర్మాణం చేపట్టి ఆధునికీకరణకు పునాది వేశారు.
కరువు కాటకాలు, దేశంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. ఈ చర్చి క్రైస్తవ మందిరమైన పరమత సహనానికి ప్రతీకగా నిలుస్తోంది. విభిన్న మతాలకు చెందిన వేలాది మంది చర్చికి వస్తుంటారు. క్రిస్మస్ పండుగ రోజు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు.
ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి చర్చిని సందర్శించిన కేసీఆర్....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో కె.చంద్రశేఖర్రావు ఈ నెల 17న మెదక్ వచ్చిన సందర్భంగా ప్రపంప ప్రఖ్యాతిగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిని సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రెసిబీటర్ ఇన్చార్జి రాబీన్సన్ సీఎం కేసీఆర్ను శాలువాలు, మెమోంటాలతో ఘనంగా సన్మానించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జీలు, డీజీపీలు, సినీ నటులు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ దేశాల ప్రముఖులు ఈ చర్చిని దర్శించుకోవడానిక వచ్చారు. చరిత్రాత్మక విశిష్టత కలిగిన ఈ చర్చి క్రిస్మస్ పండుగతో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జాతర జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవిదేశాల నుంచి ఈ చర్చిని సందర్శించడానికి ప్రజలు వస్తారు.
------------------------------
మహాత్వపూర్వక అగ్రగణ్యులు ధర్మస్వరూపులు కాలస్వరూపులు
మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు యావత్తు మానవజాతికి క్రిష్మాస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోనుచున్నారు
No comments:
Post a Comment