పరిశోధనలకు ప్రాధాన్యం
Updated : 1/4/2015 3:36:46 AM
Views : 238
ముంబై, జనవరి 3: శాస్త్ర, సాంకేతిక రంగాలపైనే దేశ పురోగతి, మానవాభివృద్ధి ఆధారపడి ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచాన్ని ఏకంచేసే శక్తి ఈ రంగానికి ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడం ఎంత ముఖ్యమో.. పరిశోధనలనూ అంతే సులభతరం చేయాల్సిన అవసరం ఉన్నదని మోదీ పేర్కొన్నారు.
-డిజిటల్ కనెక్టివిటీ ప్రాథమిక హక్కు కావాలి
-ప్రతి నిరుపేదకు శాస్త్ర, సాంకేతికరంగం అందుబాటులోకి రావాలి
-మంగళ్యాన్ మన శాస్త్రవేత్తల సత్తాకు మచ్చుతునక
-102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
-ప్రతి నిరుపేదకు శాస్త్ర, సాంకేతికరంగం అందుబాటులోకి రావాలి
-మంగళ్యాన్ మన శాస్త్రవేత్తల సత్తాకు మచ్చుతునక
-102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
ముంబైలో శనివారం 102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించిన ఆయన.. దేశంలో శాస్త్రసాంకేతికరంగం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. దేశంలో పేదరిక నిర్మూలనకు శాస్త్ర, సాంకేతికరంగం ఎంతగానో దోహదపడుతుందని ప్రధాని అన్నారు. ఈ రంగం ప్రతి నిరుపేదకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
దేశ అభివృద్ధిని కాంక్షించే.. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శాస్త్ర, సాంకేతిక రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిజిటల్ కనెక్టివిటీ ప్రాథమిక హక్కుగా మారాలని, ప్రతి పాఠశాలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. పిల్లల్లో శాస్త్ర, సాంకేతికరంగంపై మక్కువ పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారత్లో వ్యాపారాన్ని సులభతరం చేయడం ఎంత ముఖ్యమో.. పరిశోధనలు, శాస్త్రసాంకేతికరంగ అభివృద్ధిని సులభతరం చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మోదీ అన్నారు. పరిశోధనలకు ప్రభుత్వం నుంచి తగిన నిధులు రావడం లేదన్న శాస్త్రవేత్తల ఫిర్యాదులపై కూడా మోదీ స్పందించారు.
శాస్త్రసాంకేతిక రంగాల్లోని రహస్యాలను మన శాస్త్రవేత్తలు ఛేదించాలిగానీ.. ప్రభుత్వ విధానాలను కాదు. పరిశోధనల కోసం నిధుల ప్రతిపాదనలను ఎక్కువకాలంపాటు పెండింగ్లో ఉంచడం సరికాదు. పరిశోధనల కంటే వాటికి కావాల్సిన కనీస అవసరాలను సాధించడం సంక్లిష్టం కాకూడదు అని ప్రధాని అన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు మన శాస్త్రవేత్తల వైపు చూస్తున్నదని, అనేక అంశాల్లో మనవాళ్లు ముందు వరుసలో ఉన్నారని మోదీ తెలిపారు. తొలి ప్రయత్నంలోనే మంగళ్యాన్ విజయవంతం కావ డం మన శాస్త్రవేత్తల సత్తాకు మచ్చుతునక అని ఆయ న అభిప్రాయపడ్డారు.
ఇక హుదూద్ తుఫాన్ తీవ్రతను ముందుగానే కచ్చితంగా అంచనా వేసి వేలమం ది ప్రాణాలను రక్షించగలిగారని మోదీ కొనియాడారు. శాస్త్రసాంకేతికరంగానికి నిధుల కేటాయింపును భారీ గా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. క్లిష్టమైన విధానాలు, లెక్కకు మించి నిబంధనల నుంచి మన యూనివర్సిటీలకు స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉంది. అవి మరింత స్వతంత్రంగా వ్యవహరించేలా చేయాలి. యూనివర్సిటీలు బోధనతోపాటు పరిశోధనలకు అధిక ప్రాధాన్యమివ్వాలి అని ప్రధాని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు.. యూనివర్సిటీల్లోని విద్యార్థులకు బోధించడంతోపాటు వారికి మార్గనిర్దేశం చే యాలని పిలుపునిచ్చారు.
అయితే శాస్త్రసాంకేతికరం గం వల్ల అసమానతలు పెరుగడం, పర్యావరణం దె బ్బ తినడంలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని మో దీ హెచ్చరించారు. అందుకే మానవాభివృద్ధే లక్ష్యంగా దేశ శాస్త్రసాంకేతికరంగం ముందడుగు వేయాలని సూచించారు. ఈ రంగానికి అన్ని విధాలా సాయం చేస్తానని.. ఈ విషయంలో తనకంటే మెరుగైన వ్యక్తి లేరని మోదీ అన్నారు. సదస్సును ఏర్పాటుచేసిన ముంబై విశ్వవిద్యాలయానికి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 45 ఏండ్ల తర్వాత ఈ ఐదురోజుల సదస్సుకు మరోసారి ఆతిథ్యమిచ్చే అవకాశం ముంబైకి దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ సదస్సులో తమ విలువైన అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు నోబెల్ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ సన్మానించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు.
ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్పో ప్రారంభం
102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో భాగంగా బాంద్రాకుర్లా కాంప్లెక్స్లో ప్రైడ్ ఆఫ్ ఇండియా ఎక్స్పోను కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో అత్యాధునిక సాంకేతికతలు, సైంటిఫిక్ ఉత్పత్తులు-సేవలు, భారత పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లు సాధించిన ఘనతలు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శనకు ఉంచారు.
డీఆర్డీవో, ఇస్రో ఉంచిన రాకెట్లు, శాటిలైట్ ట్రాన్స్పాండర్లు.. మంగళ్యాన్ నమూనా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లు కూడా తమ స్టాళ్లను ఏర్పాటుచేశాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు సాధారణ ప్రజలకు కూడా ఈ ఎగ్జిబిషన్ను చూసే అవకాశం కల్పించారు.
No comments:
Post a Comment