పిడుగు పడేటపుడు ‘అర్జునా.. పాల్గుణా’ అని ఎందుకు అంటారో తెలుసా?
వర్షం జోరుగా కురుస్తూ ఉంటుంది. కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు, ఉరుములతో కూడిన వాన వస్తున్నప్పుడు భయం వేస్తుంది. పిడుగు పడుతున్నప్పుడు ఇంట్లో వాళ్లు వెంటనే ‘అర్జునా.. పాల్గుణా’ అని తలుస్తారు. వాళ్లు ఎందుకలా అంటున్నారో తెలియకపోయినా.. మనకు కూడా అర్జునుడిని తల్చుకోవడం అలవాటైపోయింది. నిజానికి అలా ఎందుకు తల్చుకుంటారంటే? దాని వెనుక కథ ఉంది.
విరాట నగరంలో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న సమయంలో ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నల (అర్జునుడు) శమీ వృక్షం దగ్గరకు వస్తాడు. కౌరవులను ఎదుర్కోవటానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పది పేర్లు చెప్పి అర్జునుడు అతనికి భయం పోగొడతాడు. ఆ పది పేర్లు ‘అర్జునః, పాల్గునః, పార్థః, కిరీటీ, శ్వేతవాహనః, భీభత్సో, విజయో, కృష్ణః, సవ్యసాచీ, ధనంజయః’ వీటి అర్థాలు ఏంటంటే అర్జునుడు అంటే తెల్లనివాడు, ఫల్గుణుడు అంటే ఫల్గుణ నక్షత్రంలో, మాసంలో పుట్టినవాడు, పృథ(కుంతీదేవి) కుమారుడు కనుక పార్థుడు, యుద్ధంలో అతని కిరీటం (కీర్తి) బాగా ప్రకాశిస్తుంది కనుక కిరీటి, తెల్లని గుర్రాలతో కూడిన రథం కలవాడు కనుక శ్వేతవాహనుడు, అతను యుద్ధం చేసే రీతిని బట్టి భీభత్సుడు, ఎప్పుడూ విజయం అతడినే వరిస్తుంది కనుక విజయుడు, మిక్కిలి ఆకర్షణీయమైన వానికి తండ్రి పెట్టిన పేరు కృష్ణుడు, కుడిచేత్తోనే కాదు, ఎడమ చేత్తో కూడా ధనస్సును వేయగలడు కనుక సవ్యసాచి, ధనం మీద మోజు లేదు కనుక ధనంజయుడు. ఈ పది పేర్లు .. వాటి అర్థాలు చెప్పుకుంటే ఎలాంటి భయమైన పోతుంది. అందుకే పిడుగులు పడినపుడు కూడా భయపడకుండా ఈ పేర్లను తలుస్తారు.
No comments:
Post a Comment