*** శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యంత పెద్ద విమానం***
హైదరాబాద్ ఎయిర్ పోర్టు అద్భుత దృశ్యానికి వేదిక అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కార్గో ఫ్లైట్ అనతోవ్ AN-225 విమానం శంషాబాద్ రన్ వే పై ల్యాండ్ అయ్యింది. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ వెళ్తున్న ఈ విమానం.. ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీకి చెందిన 130 టన్నుల ఇంజినీరింగ్ ఎక్విప్ మెంట్ తో పెర్త్ వెళ్తున్న ఈ ఫ్లైట్ లో… 20 మంది సిబ్బంది, ఆరుగురు అటెండెంట్స్ ఉన్నారు.
ఈ ఫ్లైట్ పొడవు 84 మీటర్లు, రెక్కల వ్యాసం 905 మీటర్లు.. అంటే ఓవరాల్ గా ఈ విమానాన్ని నిలపాలంటే ఓ ఫుల్ బాల్ మైదానమంత ప్లేస్ కావాలి. దీనికి 20 టైర్లుంటాయి. ఈ ఫ్లైట్ ఎత్తు 18 మీటర్లు, ఒక్కో రెక్క పొడవు 88.4 మీటర్లు, ఖాళీ విమానం బరువు 2 లక్షల 85 వేల కిలోలు. ఇది దాదాపు 6 లక్షల 40 వేల కిలోల బరువుతో గాలిలో ఎగరగలదు.
దీని ఇంధనట్యాంకు కెపాసిటీ 3 లక్షల లీటర్లు. శంషాబాద్ లో దాదాపు లక్షా 8 వేల లీటర్ల ఇంధనాన్ని నింపుకుని జకర్తా బయలుదేరి వెళ్లనుంది. ఇది ల్యాండవ్వాలంటే రన్ వే కూడా చాలా వెడల్పుగా ఉండాలి. విమానాన్ని పార్క్ చేసేందుకు ప్లేస్ ఎక్కువగా ఉండటం, రన్ వే విశాలంగా ఉండటంతో ఇంధనం నింపుకోవడానికి శంషాబాద్ ను సెలక్ట్ చేసుకున్నారు.
ఇక భారీగా సరుకులను మోసుకెళ్లేందుకు విమానం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఓ బోయింగ్ విమానాన్ని కూడా ఈ ఫ్లైట్ లో తీసుకెళ్లొచ్చు. అంతేకాదు.. లగేజీని కిందకి దించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ల్యాండవ్వగానే ఫ్లైట్ కాక్ పిట్ కింద ఉంటే డోమ్ తెరచుకుంటుంది. దాన్నుంచి ఓ హైడ్రాలిక్ డోర్ కిందకి వస్తుంది. దీనిపై నుంచి వాహనాలు లోపలికి వెళ్లే వీలుంటుంది. ఎంత పెద్ద వస్తువులనైనా.. దీన్నుంచి బయటకు తీసుకురావొచ్చు.
ఈ ఫ్లైట్ మొదటిసారిగా 2002 జనవరి 2న జర్మనీలోని స్టట్ గార్ట్ నుంచి ఓమన్ లోని తుమ్రేట్ కు ప్రయాణించింది. అమెరికా సైనికుల కోసం 187 టన్నుల బరువున్న 2 లక్షల 16 వేల ఆహారపదార్థాలను మోసుకెళ్లింది. అంతేకాదు… 240 వాల్డ్ హెవీ లిఫ్ట్ రికార్డులను సొంతం చేసుకుంది ఈ ఫ్లైట్.
1988లో మొదటి ఫ్లైట్ ను తయారు చేసింది రష్యా. స్పైస్ షిప్ లను తరలించడానికి దీన్నితయారుచేశారు. ఎనిమిదేళ్లపాటు.. దీనిని రష్యా ఆర్మీలో ఆపరేషన్లకు ఉపయోగించారు. తర్వాత మార్పులు చేసి కమర్షియల్ ఫ్లైట్ గా మార్చేశారు. 20 గంటల పాటు హైదరాబాద్ లో ఉండే ఈ విమానం.. వచ్చే ఆదివారం పెర్త్ లో ల్యాండవ్వనుంది. అనతోవ్ AN-225 ను చూసేందుకు పెర్త్ ఎయిర్ పోర్ట్ కు దాదాపు 50 వేల మంది వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.
No comments:
Post a Comment