|
ఓల్డ్ ఈజ్ గోల్డ్ పోరాటాల పురిటిగడ్డ విజయవాడలో ప్రతికూల పరిస్థితుల్లో సీ్త్ర విద్యావ్యాప్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధురాలు. ఆంధ్రదేశంలో విద్యారంగంలో వినూత్నమైన విప్లవం తీసుకు వచ్చిన ధీర వనిత. విజయవాడ తాలుకాలో మొదటి సీ్త్ర గ్రాడ్యుయేట్..
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ. ఆమెకు ఇప్పుడు 91 ఏళ్లు. అయినా సరే సడలని ఆత్మవిశ్వాసం ఆమె సొత్తు. ఇన్నేళ్ల జీవన ప్రయాణం గురించి ‘నవ్య’తో
మాట్లాడారు..
‘‘ఆరునూరైనా ఉదయం నాలుగు గంటలకే మెలకువ వస్తుంది. చదువుకునే రోజుల నుంచే ఈ అలవాటు ఉంది. ఇది నా జీవితాన్ని ఎంతో మార్చింది. నాకు రచనలు చేయడమంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఓ నలభై పుస్తకాలు రాశాను. ఇవన్నీ తెల్లవారుజామున కూర్చుని రాసినవే. ఆ ప్రశాంత వాతావరణంలో మనుసు ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. అదొక అద్భుతమైన అనుభవం. అదే నా జీవశక్తిగా మారిందనుకుంటాను. పొద్దున్నే లేవడం సగం ఆరోగ్య రహస్యం.
మిక్స్డ్ డ్రైఫ్రూట్స్తో..
మొదట్లో కాఫీ ఎక్కువసార్లు తాగేదాన్ని. క్రమక్రమంగా ఆ అలవాటును తగ్గించుకున్నాను. ప్రస్తుతం ఉదయం పూట ఒకసారి మాత్రమే కాఫీ తీసుకుంటాను. కాసేపాగిన తర్వాత అయిదు రకాల మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ నా ప్రధాన ఆహారం. వీటిలో కిస్మిస్, బాదం, పిస్తా, ఖర్జూర, అంజీర ఉంటాయి. పది నిమిషాల తర్వాత ఒక కమలాపండు రసం తాగుతాను. ఉదయం పూట తప్పనిసరిగా ఇదే నా అల్పాహారం.
ఫేవరెట్ ఆకుకూరలు..
ప్రతి రోజు ఆహారంలో ఆకుకూరలు తప్పని సరిగా ఉండాల్సిందే! ఆకుకూరలతో వంటకం లేకపోతే భోజనం చేసినట్లుండదు. టమోటా, తోటకూరలతో చేసిన పులుసు, బచ్చలికూర, పాలకూర ఎక్కువగా తీసుకుంటాను. బీరకాయ, పొట్లకాయ, చిక్కుడు, బంగాళదుంపలు కూడా ఎక్కువే. రాత్రిపూట మాత్రం పప్పుచారు, ఇగురు, పెరుగన్నం ఉండనే ఉంటాయి. వయసు రీత్యా షుగరు, బీపీ వచ్చాయి. అయినా నా ఆహారపు అలవాట్లలో పెద్దగా మార్పు రాలేదు. ఇప్పటికీ స్వీట్లను ఇష్టంగానే తింటాను. ఆహార పరిమాణంలో మార్పు వచ్చింది కాని ఆహారపు అలవాట్లలో ఏమాత్రం రాలేదు.
ఎర్లీ బెడ్.. ఎర్లీ వేకప్..
మాంటిస్సోరి నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఏడవుతుంది. ఓ పదిహేను నిమిషాలు నడుంవాల్చి ఓ కప్పు కాఫీ తాగుతూ టీవీల్లో వార్తలు చూస్తాను. రాత్రి 9 గంటలకు ముందే పప్పుచారు అన్నం, ఇగురు, పెరుగన్నం తిని.. కాసేపయ్యాక నిద్రకు ఉపక్రమిస్తాను. రాత్రి పూట తొందరగా నిద్రపోవడానికి.. ఉదయాన్నే మేల్కోవడానికి సంబంధం ఉంది. ఎంత త్వరగా నిద్రలేస్తే.. అంత త్వరగా నిద్రపోవాలనిపిస్తుంది. దీన్నే ఒక అలవాటుగా చేసుకుంటే.. అదే స్వభావంగా మారుతుంది.
అంకితభావమే ఆరోగ్యం
పగటి పూట విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. విద్యాసంస్థలకు చెందిన నిర్ణయాలతోనూ, అధికారులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపటంతోనే సమయం గడిచిపోతుంది. ఆదివారం మాత్రమే మధ్యాహ్నం పూట ఓ కునుకు తీస్తాను. ఎందుకంటే ఆరోజు విద్యాసంస్థలకు సెలవు. మిగతా రోజుల్లో విద్యాసంస్థల ప్రాంగణంలోనే గడుపుతాను. రోజు వారి టీచింగ్ స్టాఫ్ రిపోర్టును పరిశీలిస్తాను. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. సకాలంలో పాఠ్యాంశాలు పూర్తయ్యే వరకు స్వయంగా పర్యవేక్షిస్తాను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒక క్రమబద్ధమైన జీవనవిధానం, సుదీర్ఘలక్ష్యం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అంకితభావంతో చేసే ఏ పనిలోనైనా సంతృప్తి దక్కుతుంది. మన మనసుకు, శరీరానికి అదే కదా కావాల్సింది!
సత్యసాయి ప్రభావం..
కొన్నేళ్ల నుంచి వస్తున్న అలవాట్లు.. కొందరి ప్రభావం మూలంగా మార్పు వస్తుంది. ఆ మార్పు మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఒకప్పుడు నేను చికెన్, చేపలు బాగా ఇష్టంగా తినేదాన్ని. సత్యసాయి భక్తురాలుగా మారిన తర్వాత నాన్వెజ్ మీద అయిష్టత ఏర్పడింది. ఆయన బోధనలు, ఆయన జీవన విధానం తెలియకుండానే నన్ను ప్రభావితం చేశాయి. రోజు వారి ఆహారంలోనూ అనుకోని మార్పులు వచ్చాయి. స్వామి (సత్యసాయి) భక్తులం అయిన తర్వాత నా పిల్లలు ఏనాడు నాన్వెజ్ తినలేదు. దీంతో మనవళ్లు, మనవరాళ్లు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తున్నారు.
నడక నన్ను నిలబెట్టింది..
విద్యాసంస్థల నిర్వహణ సమయంలో తెలియకుండానే ఒత్తిడికి గురయ్యేదాన్ని. విధి నిర్వహణలో భాగంగా ప్రతి క్లాసుకు వెళ్లి పరిశీలించేదాన్ని. అంతేగాక ప్రేయర్ గ్రౌండ్లో కూడా విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేదాన్ని. దీంతో తెలియకుండానే చాలా దూరం నడిచేదాన్ని. నడక వల్ల ఒత్తిడి చాలా తగ్గేది. ఇది నా అనుభవంలోకి వచ్చింది. సత్యసాయి ప్రభావంతో మెడిటేషన్ కూడా చేయటం నేర్చుకున్నాను. ప్రస్తుతం ఎవరి సాయం, వాకర్ లేకుండా నడవలేను. అందుకే మెడిటేషన్ చేస్తున్నాను. నడక మనల్ని ఎంతగా మారుస్తుందో దాన్ని చేస్తే గాని తెలియదు.
ఒంటరితనాన్ని పోగొట్టే మంత్రం..
ఏదైన సమస్య వచ్చినప్పుడు, ఒంటరి అనే భావన కలిగినప్పుడు సాయిగాయత్రి మంత్రం ఉచ్చరించటం వల్ల ధైర్యంతో పాటుగా సమస్యకు పరిష్కారం దొరికేది. ప్రయాణం చేస్తున్నంత సేపు సాయిగాయత్రి మంత్రం తప్పక చదువుతాను. ఈ మంత్రం వల్ల మనసులోని అలజడి తగ్గేది. ఓ సారి సత్యసాయిని కలసినపుడు ‘‘స్వామీ.. మంత్రం తప్పుగా ఉచ్చరిస్తే అరిష్టమంటున్నారు. భగవంతుడు శిక్షిస్తాడని చెపుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?’’ అని అడిగాను. చిరునవ్వుతో స్వామి ‘‘బంగారు మంత్రాన్ని తప్పుగా చదివినంత మాత్రాన శిక్షించడు భగవంతుడు. మంత్రం పఠించటానికి ఉన్న ఉద్దేశాన్ని మాత్రమే తీసుకుంటాడు’’ అన్నారు. మనసే మందిరంగా భావిస్తాను. దీంతో ప్రత్యేకంగా భగవంతునికి పూజలు చేయను. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్వామి నాకు ఓ స్పటిక మాల ఇచ్చారు. దీంతో రోజూ మంత్రాన్ని చదివేదాన్ని. చాలా సమస్యలకు పరిష్కారం దొరికేది. కొద్ది రోజుల కిందట నా అజాగ్రత్త వల్ల ఆ మాల కనిపించకుండా పోయింది. ఇది నన్నెంతో బాధ పెట్టింది.
జీవిత పుస్తకం రాస్తున్నా ...
ఇప్పుడు ‘భారతీయ ఆంగ్ల సాహిత్యం’ అనే పుస్తకాన్ని పూర్తి చేశాను. ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశించటంతో భారతీయ సాహిత్యంపై ఆంగ్ల భాషా ప్రభావం పడింది. భారతీయ సాహిత్యంపై ఆ ప్రభావం ఏవిధంగా పడిందో తెలియచెప్పటమే నా ఉద్దేశం. ఈ పుస్తకం ఫ్రింటింగ్కు రెడీ అయింది. త్వరలో విడుదల చేస్తాను. అదే విధంగా నా స్వీయ అనుభవాలు అనే పుస్తకాన్ని రాద్దామనుకుంటున్నాను. సీ్త్రవాద సాహిత్యంపై కూడా పుస్తకం రాశాను. నా అనుభవాలను రాతల రూపంలో చూసుకున్నప్పుడు.. నా జీవనప్రయాణం.. అప్పటికి ఎదురైన సంఘటనలకు నేను స్పందించిన తీరు మరొకసారి అవగతం అవుతుంది. అందులో నుంచి కొత్తశక్తి వస్తుంది. ఇన్నేళ్ల నా ప్రయాణానికి ఇవన్నీ జీవశక్తి ఔషధాలు.
పెద్దింటి కృష్ణ చైతన్య, విజయవాడ
ఫోటోలు : వై.డి. ఆనంద్
డీమ్డ్ యూనివర్శిటీ నా కల
నా విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా వరకు నా కలలు తీరాయి. అయితే డీమ్డ్ యూనివర్శిటీ స్వప్నం ఇంకా తీరలేదు. డీమ్డ్ హోదా కోసం కృషి చేస్తున్నాను. ఆ శుభవార్త ఎప్పుడు వింటానా అనే ఆశతో జీవిస్తున్నాను.
ఇంటిపేరు మాంటిస్సోరి అయ్యింది...
1955 లో మాంటిస్సోరి విద్యాసంస్థలకు పునాది పడిన సంవత్సరం. ఆ సంవత్సరం నాజీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈనాటి ఈ ఖ్యాతికి ఆనాడు తీసుకున్న నిర్ణయమే కారణమని కచ్చితంగా చెప్పగలను. విజయవాడ పాతబస్టాండ్ ప్రాంతంలో ఓ ఇంట్లో ప్రారంభించిన విద్యాసంస్థ కొన్ని కారణాల వల్ల మూతపడింది. విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఆ విద్యాసంస్థ నిర్వహణా బాధ్యతలు తీసుకుని మాంటిస్సోరి విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించాను. నాటి నుంచి ‘మాంటిస్సోరి కోటేశ్వరమ్మ’ అని అంతా పిలుస్తున్నారు. విజయవాడలో స్కూల్, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, ఫిజియోథెరపీ కాలేజి, బిఇడి కాలేజీలు, మైలవరంలో ఇంజనీరింగ్ కాలేజి, ఫార్మసి కాలేజీలు నడుస్తున్నాయి. ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకుని.. కష్టపడి పనిచేసుండకపోతే.. ఈ రోజు నాకు ఈ పేరుప్రతిష్టలు దక్కేవి కావు. ఆ విషయం తల్చుకున్నప్పుడల్లా మనసు ఉప్పొంగుతుంది.
|
No comments:
Post a Comment