భక్తుల క్రెడిట్ కార్డులనుంచి నిధుల తస్కరణ
న్యూయార్క్, ఏప్రిల్ 15: బ్యాంకులను మోసం చేయటం, పన్ను ఎగవేత, అక్రమ సంపాదన కేసుల్లో భారత సంతతికి చెందిన ఓ పూజారికి న్యూయార్క్ కోర్టు 27ఏళ్ల జైలు శిక్ష విధించింది. అన్నామలై (49) అలియాస్ స్వామీజీ శ్రీ సెల్వం సిద్ధార్ అనే వ్యక్తి.. విలాసవంతమైన జీవితం గడిపేందుకు.. సమస్యలతో వచ్చే భక్తులను మోసం చేశాడని విచారణలో తేలింది. మతాన్ని మత సంస్థలను అడ్డం పెట్టుకుని.. వ్యక్తిగతంగా లాభం పొందేందుకు చాలా కుటిలయత్నాలు చేశారని.. అమెరికా అటార్నీ జాన్ హార్న్ తెలిపారు. జార్జియాలోని ఓ దేవాలయంలో పూజారిగా ఉన్న సమయంలో.. వివిఽధ ఇబ్బందులతో వచ్చే భక్తులకు ప్రత్యేక పూజల పేరుతో.. క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని ఇష్టం వచ్చినంత తీసుకునేవాడని.. ఇలా చాలా సార్లు జరిగిందని బాధితులు కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఇదేంటని అడిగితే.. తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. గుడిలో సేవల పేరుతో.. వచ్చే నిధులను, ఇలా క్రెడిట్ కార్డుల ద్వారా సంపాదించిన సొమ్మును తన అకౌంట్లో వేసుకుని.. అన్నామలై విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. లగ్జరీ కార్లు, బంగళాలు, ఇండియాలో విదేశీ బ్యాంకు అకౌంట్లు ఇలా ఎన్నో అన్నామలై కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్నాయని విచారణలో తేలింది. సంపాదించిన ఆస్తులు తనఖాలో ఉన్నాయంటూ.. బ్యాంకులకు కట్టాల్సిన పన్ను ఎగవేయటంపై కూడా కోర్టు విచారించింది. అన్నామలైకి 27 ఏళ్ల కారాగార శిక్షను విధించింది.
No comments:
Post a Comment