|
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తెలుగు ప్రజలు గర్వించేలా, 21వ శతాబ్దపు ప్రజా రాజధానిగా, ఓ డైనమిక్ సిటీగా నిర్మిస్తామని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి అందచేసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గర్వంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామి అయినందుకు ఎంతో సంతోషంగా ఉందనీ, జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్(కీలకమైన ప్రభుత్వ నిర్మాణాలు వుండే ప్రాంతం)ను సింగపూర్ ప్రభుత్వం అందిస్తుందనీ, జూన్ 6న భూమిపూజ చేసి విజయదశమి నుంచి నిర్మాణ పనులు మొదలు పెడతామని తెలిపారు. కేంద్రం నుంచి తాము ఆర్ధిక సాయం తప్ప ఏ రకమైన సాయం కోరడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన చంద్రబాబు పట్టాణాభివృద్ధి శాఖ నుంచి రూ.1000 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించిందన్నారు.
ఆంధ్రుల ప్రస్తావనకు ఆద్యులైన శాతవాహనుల కాలంలో వర్ధిల్లిన అమరావతి పేరును కొత్త రాజధానికి నామకరణం చేసినప్పుడే ప్రతి తెలుగు వ్యక్తీ ఆనందంతో పులకించి పోయాడు. నిర్మించబోయే నగరం సామాజిక, సాంస్కృతిక, సాంప్రదాయ, వ్యాపార, వాణిజ్య, పర్యాటక నగరంగా వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. వేలఏళ్ళ ఆంధ్రుల ప్రస్థానంలో మొట్టమొదటి రాజధాని కూడా ఈ ప్రాంతంలోనే వుండడం విశేషం. రెండువేల ఏళ్ళ క్రిందట విజయవాడ సమీపంలో వున్న శ్రీకాకుళం ఆంధ్రుల మొదటి రాజధాని. ఇప్పుడు మళ్ళీ ఆ కృష్ణమ్మ తీరమే తెలుగువారికి శాశ్వత రాజధాని కాబోతుంది. ఇప్పుడు శాశ్వతంగా నిర్మించుకోబోయే రాజధాని తెలుగు వారికి 13వ రాజధాని. ఇన్నాళ్ళకు తెలుగువారికి ఒక శాశ్వత రాజధాని ఏర్పడుతుందంటే ఆనందించని ఆంధ్రుడే వుండడు. చంద్రబాబు ఎన్నికల నాటినుంచే అద్భుతమైన రాజధాని అని ప్రచారం చేసుకొన్నారు. అనుభవం వున్న నాయకుడిగా పేరున్న చంద్రబాబు మాటలు నమ్మి రైతులు కూడా రాజధాని నిర్మాణానికి భూములు ప్రభుత్వానికి అప్పజెప్పారు. చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణ పరిశీలనకంటూ జపాన్, సింగపూర్, కౌలాలంపూర్, జర్మనీ ఇలా చాలా దేశాలు మందీమార్బలంతో స్వంత విమానాల్లో తిరిగొచ్చారు. అక్కడి రాజధానులు చూసి అంతకుమించి రాజధాని కట్టిస్తామని ప్రకటనలు చేసారు. ఇంతవరకూ వినడానికి, ఊహించుకోవడానికి బాగానే వుంది. కానీ రాజధాని నిర్మాణం అంటే మాటలు కాదు. లక్షల కోట్ల రూపాయలతో పని. అసలే ఆర్థికంగా కుదేలైన మన రాష్ర్టానికి ఇప్పుడు ఇంత అద్భుత రాజధాని నిర్మించుకోవడానికి నిధులు ఎలా సమకూరుస్తారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ అయోమయానికి కారణం కూడా చంద్రబాబు తీరే అని చెప్పక తప్పదు. ఒక పక్క ప్రపంచస్థాయి నగరంగా రాజధాని నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతూనే, మరోపక్క ఉద్యోగులకి జీతాలివ్వడానికే డబ్బులు లేవు అని అనడం అందరినీ అయోమయానికి గురిచేస్తోంది. మొదటి నెలలోనే ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళిన ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అదే సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఏడువేల కోట్ల లోటు బడ్జెట్ అని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఆ లోటు ఎలా పూడుస్తారో చెప్పడం లేదు కానీ, లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పడం రంగుల కలలు చూపిస్తున్నట్లుంది. మళ్ళీ ఆయనే రెక్కలు విరిచేసి ఎగరమంటారా అంటూ వాపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందనీ, అత్యంత ఆర్ధిక ఇబ్బందులలో ఉందనీ ప్రతి ఒక్కరికీ తెలిసినదే. మరి ఇటువంటి స్థితిలో ఇన్ని కోట్ల ఖర్చుతో రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రజలందరూ అయోమయానికి గురౌతున్నారు. విభజన బిల్లు ప్రకారం రాజధాని నిర్మించే బాధ్యత కేంద్రానిదే అయినా, కేంద్రం ఈ విషయంలో అంతగా శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటివరకూ ఇంచుమించు రూ. 1500 కోట్లు కేంద్రం ప్రకటించిందని ముఖ్యమంత్రే స్వయంగా తెలిపారు. ఆ సొమ్ముతో కనీసం రోడ్లు కూడా నిర్మించుకోలేం. పోనీ విడతల వారీగా కేంద్రం నిధులు విడుదల చేస్తుందా అంటే అదీ నమ్మకం కలగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకు రాకుండా ప్రజల్ని మాత్రం రాజధాని నిర్మాణంలో భాగ స్వాములుకండి అంటూ చందాలు వసూలు చేయడం విడ్డూ రం. ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇచ్చే నిధులతో ఇంత అద్భుతనగరం నిర్మిస్తామనడం హాస్యాస్పదమే అవుతుంది.
ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు చూసి చంద్రబాబుని గెలిపిస్తేనే కేంద్రం నుంచి నిధులు రాబట్టగలరూ అని జనం నమ్మి ఆయనకి అధికారం అప్పచెప్పారు. కానీ ప్రజలు అనుకొన్నది ఒకటీ, ఇప్పుడు జరుగుతున్నది మరొకటి. కేంద్రాన్ని డిమాండ్ చేసి నిధులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు ఈ విషయంలో నిర్లిప్తతగా ఉంటున్నారో అర్ధంకాని పరిస్థితి. నెలకోసారి చంద్రబాబో, ఆయన మంత్రివర్గ సహచరులో ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అభ్యర్ధించినా కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని కనీసం లెక్కచేయడం లేదు. బడ్జెట్లో కూడా కేంద్రం ఏపీకి మొండిచెయ్యే చూపింది. రాజధాని లేని మన రాష్ర్టానికి కేంద్రం వేసిన ముష్టి రూ.444 కోట్లు. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు చంద్రబాబు అన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా కేంద్రానికి ఎంత నిర్లక్ష్యమో. ఇక రాష్ర్టానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. సామాన్య ప్రజలకే కాదు అపర చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు గారికి కూడా కేంద్రం మనసులో ఏముందో అర్ధం కావడంలేదు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఎవరికి తోచిన ప్రకటన వారు చేస్తూనే వున్నారు. ఫలితం మాత్రం శూన్యం.
ఇదంతా ఒక ఎత్తైతే రాజధాని నగర నిర్మాణానికి కారణభూతులైన రైతులకు అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని ఇప్పటివరకూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో కనీసం దీనికోసం ఒక్క ఎకరా భూమి కేటాయించక పోవడం భూములిచ్చిన రైతుల్లో ఆందోళన కలుగచేసింది. వివిధ అవసరాల కోసం మాస్టర్ ప్లాన్లో భూమిని స్పష్టంగా గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం రైతులకిచ్చే భూమిని స్పష్టం చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. రైతులకు భూములు ఎక్కడ ఇవ్వాలనేది తరువాత నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నా, మాస్టర్ ప్లాన్లో అన్ని అవసరాలకు భూమిని కేటాయించిన తరువాత తమకు ఎక్కడ నుంచి తీసుకువచ్చి ఇస్తారన్న ప్రశ్న రైతాంగం నుంచి వస్తుంది. వాస్తులోని అన్ని అంశాలను చెప్పి ప్లాన్ గీయించుకున్న ప్రభుత్వ పెద్దలకు రైతులకియ్యవలసిన భూముల విషయం పట్టలేదా అని వీరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మాస్టర్ ప్లాన్లో పెద్ద సంఖ్యలో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలను కలిపివేయడం పట్ల స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ని సంక్లిష్ట పరిస్థితులు, అనుమానాల మధ్య చంద్రబాబు అద్భుత నగరమైన అమరావతిని కట్టి తీరుతామని ప్రతిజ్ఞ చేయడం విడ్డూరంగా వుంది.
ఇన్నాళ్ళూ కాలవశాన రాచరికాలు, రాజకీయ కారణాలతో పన్నెండు రాజధానులు వదులుకొన్న ఆంధ్రులు ఇప్పుడు అమరావతిని శాశ్వత రాజధానిగా చేసుకోబోతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ఆంధ్రుల ప్రస్థానంలో మొదటి రాజధాని అయిన ప్రాంతం దగ్గరలోనే ఇప్పుడు శాశ్వత రాజధాని నిర్మాణం చేపట్టడం. ఇప్పటికైనా అమరావతితో బాటుగా రాష్ట్రమంతా సమగ్రంగా, సమర్థంగా, సమానంగా అభివృద్ధి చేసుకొంటే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్త కుండా నివారించవచ్చు. రాజధానిగా అమరావతితో బాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి అమరావతిని ఆంధ్రులకు ఇకపై శాశ్వత రాజధానిగా ఉండేలా చేయాలని ఆశిద్దాం...
కూసంపూడి శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి, జనజాగృతి సేవా సమి
|
No comments:
Post a Comment