నేను అద్దెకు ఉండే ఇంటి వెనుకవైపు రెండు కుటుంబాలు గుడిసెలు వేసుకుని కాపురం ఉంటున్నారు.మగవాళ్లు కూలి పనికో లేక ఏదో పనికి వెళ్తుంటారు.ఆ ఆడవాళ్లు మాత్రం చుట్టుప్రక్కల ఇళ్లలో పాచిపని, అంట్లు తోమటం చేస్తుంటారు. పాపం! రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. ఆందులో ఒకావిడ మా ఇంటిగల వాళ్ల బట్టలు ఉతుకుతుంది.
ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుందన్నట్లు ఇలా ఎందుకు జరుగుతుందో ఏమో కానీ ఎక్కువ శాతం పేదవారే తాగుడు,జూదం,గుట్కా…ఇలాంటి వ్యసనాలకి బానిసలుగా మారతారు. ఈ పనిమనిషి భర్త కూడా ఆ బాపతే. వయసు సుమారు 25, ఆవిడకి మహా అయితే 22 ఉంటాయేమో.
ఒక రోజు రాత్రి 9 గం. అవుతుండగా ఇంటి వెనుక నుంచి అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయి. ప్రహరి గోడ దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ ప్రబుద్ధుడు భార్యను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు. మరీ హీనంగా జుట్టు పట్టుకు మరీ ఈడుస్తున్నాడు. పైగా తాగి ఉన్నాడు.ఒళ్లంతా బురదతో పరమ రోతగా ఉన్నాడు. వాళ్లకి ఇద్దరు పిల్లలు.ఇద్దరూ ఐదారేళ్లవారే. వాళ్ల నాన్న చేస్తున్న భీభత్సానికి భయపడుతూ బిక్కు బిక్కుమటూ తడిక చాటు నుంచి చూస్తున్నారు. సైకాలజిస్టులు ‘పిల్లల ఎదుట పెద్దవారు కనీసం వాదోపవాదాలు పెట్టుకోవద్దు`అని చెప్తున్నారు.మరి ఇక్కడ ఈ బడుద్ధాయి అలా పైశాచికంగా ప్రవర్తిస్తుంటే ఆ పిల్లలు తండ్రి గురించి ఏమనుకుంటారు? వాళ్ల మనసుపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?, అసలు వారికి తమ తండ్రిపైన గౌరవభావం కలుగుతుందా? కలుగదు గాక కలుగదు. ఆవిడ పిల్లల్ని తీస్కొని మా ఓనరు గారింటికి వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి వెళ్లిపోయింది.
తెల్లవారింది.అతని కిక్కు– ఆవిడ బెట్టు రెండూ వదలిపోయాయి.నేను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక కాసేపు మేడ పైకి వెళ్లాను. అలా పచార్లు చేస్తూ వెనుక ఉన్న వీళ్లని చూశాను. ఆహా! ఈలపాట రఘురామయ్య లెవల్లో మనవాడు ఈల వేస్తుంటే, వయ్యారాలు పోతూ ఆవిడ తలంటు పోస్తున్నది. సహజం! భార్యాభర్తలన్నాక అలకలు-కులుకులు,ఛీఛీలు,పేచీలు,రాజీలు, బుంగమూతులు, బుజ్జగింపులు…ఇవన్నీ సర్వసాధారణం.
అంతా బాగానే ఉంది. మరి ఆ పిల్లల మనసు పైన తండ్రి పట్ల ఏర్పడిన అభిప్రాయం సంగతి ఏంటి? “మనసు విరిగెనేని మరిచేర్చరాదయా” అన్నాడు వేమన. మనం కొన్ని విషయాలు మర్చిపొయామనే అనుకుంటాం. కానీ ఆ విషయాల ప్రభావం మనసుపైన ఒక జీవితకాలం వరకు కూడా పనిచెస్తాయనేది అక్షర సత్యం.
“మాతృదేవోభవ–పితృదేవోభవ” అని వేదోక్తి.తల్లిదండ్రులకున్న స్థానం ఆ భగవంతుడికి కూడా ఇవ్వలేదు.అటువంటి స్థానంలో ఉండాల్సిన తండ్రికి దైవత్వం లేకపొతే సరేసరి. కనీసం మనిషి లా కూడా నడచుకోకుండా రక్షసత్వాన్ని ప్రదర్శిస్తే ఎలా?
ఓ తల్లిదండ్రులారా! మీరే మాకు ప్రత్యక్ష దైవాలు. మీలోని ఆ మాలిన్యాన్ని తొలగించండి. మీరు సన్మార్గాన నడవండి.మమ్మల్ని నడిపించండి.మీలొ మీరు కలహించుకోవద్దు.మా ముందు అసలు వద్దు.పిల్లల లేత హృదయాలకు చిరుగాలి గా మారి ఊపిరి పోయండి. పెనుగాలిగా మారి వారిని విషపూరితం చేయకండి.
తల్లిదండ్రులందరూ నాది సద్విమర్శగా భావిస్తారని ఆశిస్తూ…
గౌరీ రవిశంకరశర్మా అహంభో అభివాదయే…!!
No comments:
Post a Comment