సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్లో మరో పాఠాన్ని మొదలెట్టాడు. ‘గ్రామల దత్తత’ కాన్సెప్టుపై తనదైన శైలిలో చురకలు అంటించారు. గ్రామాలు దత్తత తీసుకోవడానికి ఆయా గ్రామాల్లో నివసించే ప్రజలు ఏమైనా భిక్షగాళ్లా.. అనాధలా లేదంటే అంగవికలురా..? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించాడు వర్మ.
గ్రామాల ప్రజలకు ఆత్మగౌరవం అనేది ఉంటే ‘గ్రామాల దత్తత’పై ఆందోళన చేయాలని, సెలబ్రిటీలంతా మూకుమ్మడిగా విలేజ్ లను అడాప్ట్ చేసుకోవడం గ్రామస్తులకు అవమానకరమని, ఓ హాలీవుడ్ స్టార్ ఇండియాను అడాప్ట్ తీసుకుంటే.. మనకెంత ఇన్సల్ట్ గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని, దీనివల్ల ఇండియా అభివృద్ధి చెందిన దేశం కాదనే సంకేతాలు వెళ్తాయంటూ వర్మ కామెంట్స్ చేశాడు.
అంతేకాదు… దత్తతకు ఎంపికైన గ్రామాలలోని వారెవరైనా అనాథలా? యాచకులా? వికలాంగులా?.. ఈ విషయంలో ఆయా గ్రామాల ప్రజలకు ఆత్మగౌరవం అనేది ఉంటే, అడాప్ట్ ను నిరసిస్తూ ఆందోళన చేయాలని కోరాడు. అలాగే డబ్బున్నోళ్ళు, సెలబ్రిటీల దయాదాక్షిణ్యాలపైనే తాము ఆధారపడ్డామన్న విషయాన్ని గ్రామస్థులు అంగీకరించినట్టేనని, నిజానికి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని వర్మ చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా చోటామోటా స్టార్సే గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటిస్తే, బడా స్టార్స్ అంతా గ్రామాలకు గ్రామాలే అడాప్ట్ చేసుకుంటారా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం కుట్రలా ఉందని వర్మ దుయ్యబట్టాడు. అంతేకాకుండా ఈ అడాప్ట్ చేసుకోవడం అనే విధానం కింగ్ డమ్ కల్చర్ ను చూపిస్తుందని.. ఎవరైతే గ్రామాలను దత్తత తీసుకుంటారో వారు చూపిస్తున్న దయతో ఆ గ్రామాలకు వారే కింగ్ గా ఫీలయ్యే ప్రమాదం ఉందంటూ ఏకంగా బాంబ్ పేల్చాడు.
No comments:
Post a Comment