హల్దార్ నాగ్ అంటే మాటలుకాదు
వయసు 66ఏళ్లు. మూడోతరగతి డ్రాపౌట్.. కాళ్లకు చెప్పులుండవు, చిన్న తెల్లధోతి మాత్రమే ధరిస్తాడు. అట్లాంటి వ్యక్తి భారత రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఇదెలా సాధ్యం..ఎందుకిలా అనుకుంటున్నారా.. ఆ వ్యక్తి సామాన్యుడు కాడు. హల్దార్ నాగ్ అంటే మాటలు కాదు. ఒడిశా రాష్ట్రం బర్గ జిల్లాలోని ఎక్కడో మాలుమూల గ్రామమైన గీన్స్ లో 1950లో పుట్టాడు హల్దార్. మూడో తరగతి చదువుతుండగానే తండ్రి చనిపోయాడు. దీంతో స్కూల్ కు దూరమైన నాగ్ గ్రామంలోని ఓ స్వీట్ షాప్ లో పాత్రలు తోమే పనిలో పడ్డాడు. రెండేళ్లతర్వాత, గ్రామంలోని స్కూల్ లో 16ఏళ్లుగా వంటవాడిగా పనిచేస్తున్న ఓ మనసున్న మారాజు నాగ్ కు కొత్త జీవితం ఇచ్చాడు. ఇదే నాగ్ జీవితంలో కొత్త కోణానికి కారణమైంది. వెయ్యి రూపాయలు అప్పుచేసి స్కూల్ లో స్టేషనరీ చిన్నారులకు తినుబండారాల షాపు పెట్టుకున్న నాగ్ దృష్టి, చదువుమీదకు.. క్రమంగా కవిత్వంమీదకు మళ్లింది.
చిన్న చిన్న కవితలు రాస్తూ పత్రికలకు పంపసాగాడు. ఇలా 1990లో 'ధోదొ భర్గచ్' (పురాతన మర్రి చెట్టు) పేరుతో నాగ్ రచన పత్రికలో ప్రచురితమైంది. ఇలా వరుసగా ఆయన పంపిన నాలుగు కవితలు ఆ పత్రికలో అచ్చవడం నాగ్ లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇక వెనక్కి చూడని నాగ్ తన జీవితం..ఆశ..స్వాస కేవలం కవిత్వమే అనేట్టుగా జీవితనావ సాగింది. ప్రకృతి, సమాజం, మతం, పురాణాల మీద ఎన్నో కవితలు రచించాడు నాగ్. ఇలా కోస్లి భాషలో ఎన్నో పద్యాలు, 20కి పైగా ఇతిహాసాలు ఆయన కలంనుంచి జాలువారాయి. చివరికి.. ఐదుగురు పిహెచ్ డి స్కాలర్స్ అతని రచనలమీద పరిశోధనలు చేసేంత స్థాయికి ఎదిగిపోయాడు నాగ్. అంతేకాదు, సంబల్ పూర్ యూనివర్శిటి హల్దార్ గ్రంథబలి-2 ని యూనివర్శిటీ సిలబస్ లో చేర్చి ఆయన సాహిత్య సేవకు విలువనిచ్చింది. ఎన్నికష్టనష్టాలెదురైనా మొక్కవోని ధృడ సంకల్పంతో ముందుకు సాగిన హల్దార్ నాగ్, ఓ వితంతువు కొడుకు జీవితం ఎంత దుర్భలంగా ఉంటుందో అని చెప్పిన మాటలు ఎవరికైనా కన్నీళ్లు రప్పించకమానవు.
No comments:
Post a Comment