రాజకీయాలకతీతంగా ఇంకుడు గుంతలు నిర్మిద్దాం
రాజకీయాలకతీతంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకుందామని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు అన్నారు. శనివారం బోనకల్ మండలం చొప్పకట్లపాలెం బి.సి కాలనీ అంగన్వాడి కేంద్రంలో సంస్థ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతను నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం పల్లెల్లో ప్రక్రుతిని కాపాడే విధంగా జీవన విధానం ఉండేదని, నేడు విచ్చలవిడిగా ప్రక్రుతి వనరులను ధ్వంసం చేయడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవడం వల్ల త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని, ఈ అంశంపై ప్రభుత్వం ఏమి సహకారం అందజేస్తున్నదో ప్రజలలో చైతన్యం కల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. స్వచ్చంధ సంస్థలు, రాజకీయపార్టీలు ఇటువంటి కార్యక్రమాలలో రాజకీయాలకతీతంగా పాల్గొని అందరి భవితకు బంగారు బాటలు వేయాలన్నారు. ప్రక్రుతిని , పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గ్రాంఇన ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం జరిగేలా అందరూ క్రుషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల ఇ.జి.ఎస్ ఎ.పి.ఒ బోజెడ్ల అప్పారావు, టి.ఆర్.ఎస్ నాయకుడు మండేపుడి శ్రీనివాసరావు, సిపిఎం కార్యదర్శి బొప్పాల అజయ్కుమార్, పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యదర్శి అంజయ్య, డి వై ఎఫ్ ఐ నాయకుడు కొండేటి అప్పారావు, అంగన్వాడి టీచర్ బండి జయమ్మ, వార్డు సభ్యుడు పరిటాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment