ఆట మొదలైంది ..అప్పుడే ఏమైంది?
23-11-2016 02:03:13
- అంతం కాదిది ఆరంభం.. అసలు కథ ముందుంది
- ఎందుకు అధికారంలోకి వచ్చామో గుర్తుంచుకోండి
- పేదల కోసం ఎంతకైనా తెగిస్తా
- విలువల పతనమే సంక్షోభం
- విపక్షం సూచనలిస్తే వింటా
- పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ భావోద్వేగ ప్రసంగం
- నోట్ల రద్దుకు మద్దతుగా బీజేపీపీ తీర్మానం
- ప్రవేశపెట్టిన రాజ్నాథ్, సమర్థించిన వెంకయ్య
లాల్కృష్ణ ఆడ్వాణీ... బీజేపీలో భీష్ముడిలాంటి నాయకుడు! ప్రధాని నరేంద్ర మోదీకి గురుతుల్యుడు! మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మొదటివరుసలో... అప్పటికే మోదీకి ఒకవైపు రాజ్నాథ్ కూర్చున్నారు. మరోవైపు సీటు ఖాళీగా ఉంది. ఆ పక్కన కేంద్ర మంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీ ఉన్నారు. ఆడ్వాణీ రాగానే అగ్రనేతలంతా స్పందించారు. ఆయన రాకను గమనించి... మోదీ స్వయంగా లేచి నిలుచుని... తనపక్కన కూర్చోవాలని ఆహ్వానించారు.
‘‘ఆట ఇప్పుడే మొదలైంది... పేదల అభ్యున్నతి కోసం పాటు పడతామని హామీ ఇచ్చే ఎన్నికల్లో పోటీ చేశాం... గెలిచాం... మరి ఇప్పుడు పేదల కోసం ఏమీ చేయకపోతే ఎలా? పేదల కోసం ఎంతకైనా తెగిస్తా.... నల్లధనాన్ని రూపు మాపడానికి ఎంతటి చర్యలనైనా తీసుకుంటాం... పెద్ద నోట్ల రద్దు అంశం చాలా చిన్న విషయం... అసలు కథ ముందుంది... ఇంకా చాలా చర్యలు తీసుకోబోతున్నాం... అసలు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఆశ్చర్యపడాలే కానీ... తీసుకుంటే ఆశ్చర్యం ఎందుకు?’’
న్యూఢిల్లీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఇవీ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు. మంగళవారం పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్లో జరిగిన భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘‘మనం ఎందుకు అధికారంలోకి వచ్చామో అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీనీ నెరవేర్చాల్సిందే....పెద్ద నోట్ల రద్దును సామాన్య ప్రజలు ఆహ్వానిస్తున్నారు. నల్లధనం నుంచి దేశాన్ని ప్రక్షాళన చేయడానికి క్యూలైన్లలో నిలబడి పేద ప్రజలు మద్దతును తెలియజేస్తున్నారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. మీరు వారిని పట్టించుకోకండి. ప్రతిపక్షాలను ప్రతిస్థాయిలో ఎండగట్టి ప్రజలకు నిజానిజాలు చెప్పండి’’ అన్నారు. పెద్ద నోట్ల రద్దును కరెన్సీపై సర్జికల్ దాడిగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మోదీ సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో శత్రు శిబిరాలను కనుగొని ధైర్య సాహసాలతో ఒక్కరు కూడా మరణించకుండా చేసిన మిలటరీ ఆపరేషన్తో పెద్దనోట్ల రద్దును పోల్చడం సమంజసం కాదని అన్నారు. నగదు రహిత సేవలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. రోజూ 2 .6 లక్షల మంది రైల్వే టిక్కెట్లును కొనుగోలు చేస్తుంటే అందులో 56 శాతం ఇ-టిక్కెట్లే ఉన్నాయని, త్వరలో నూటికి నూరు ఇ-టిక్కెట్ల విధానం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ బంగారు భవితకు నాంది పడిందని పేద ప్రజలు భావిస్తున్న తరుణంలో వారిని ప్రతిపక్షాలు గందరగోళంలోకి నెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ క్షేమం కోరే ప్రతిపక్షాలు లోటుపాట్లను ఎత్తిచూపి పరిష్కార మార్గాలు చూపితే బావుంటుందని, సరైన సలహాలు సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. ‘‘రాజకీయాల్లో విలువలు అంతరించి పోతున్నాయి. ప్రజాజీవితంలో ఉన్న వాళ్లే నిస్సిగ్గుగా అవినీతికి, నల్లధనానికి మద్దతు పలుకుతూ ప్రసంగాలు చేస్తున్నారు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘ఏ దేశంలోనైనా విలువలు లుప్తం కావడమే అతి పెద్ద సంక్షోభం’’ అన్నారు. ‘‘విలువలకు పాతరేస్తున్న నేతలను భావితరాల వాళ్లు క్షమించరు’’ అని హెచ్చరించారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చరిత్రాత్మకం, విప్లవాత్మకం, పేదలకు అనుకూలమని బీజేపీపీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రవేశపెట్టగా, వెంకయ్యనాయుడు సమర్థించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉంటారో, నల్లకుబేరులను కాపాడతారో తేల్చుకోవాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు నోట్ల రద్దును స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రసవ వేదనను అనుభవిస్తున్న ప్రజలకు తప్పకుండా శుభాలే జరుగుతాయని, మహాయజ్ఞం జరిగేటప్పుడు చిన్నచిన్న ఆటంకాలు సహజమేనని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగానికి, పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. పేరొందిన పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా అందుబాటు ధరల్లో గృహ నిర్మాణానికి ముందుకొస్తున్నాయని తెలిపారు. మోదీ నిరంతరం పార్లమెంటులోనే ఉంటున్నారని చెప్పారు. ప్రధాని సభకు హాజరు కావటం లేదంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
No comments:
Post a Comment