|
సంజీవ్ చతుర్వేది, అన్షులకు అవార్డు
న్యూఢిల్లీ, జూలై 29 : మనవాళ్ల సేవకు, సాహసానికి రామన్ మెగసెసే అవార్డు లభించింది. ఎయి మ్స్లో అక్రమాలను బయటపెట్టినందుకుగాను ప్రజా వేగు సంజీవ్ చతుర్వేదిని, పాతబట్టలను, వస్తువులను సేకరించి పంచే కృషికి గాను ఎన్జీవో ‘గూంజ్’ నిర్వాహకులు అన్షు గుప్తాలను 2015 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేశారు. అవార్డు కింద తమకు లభించే మొత్తాన్ని (రూ.19 లక్షలు) తమ తమ సంస్థలకు అం దించనున్నట్టు విజేతలు ప్రకటించారు.
‘నేను లంచం తినను, తిననీయను’ అన్న ప్రధాని మోదీ నినాదమే తనకు స్ఫూర్తిగా నిలిచిందని ఐఎఫ్ఎస్ అధికారి (ఇండియన్ ఫారెస్టు సర్వీస్) చతుర్వేది తెలిపారు. అలాగే, మాజీ రాష్ట్రపతి కలాం నిస్వార్థ, సానుకూల జీవన దృక్పథమూ ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. అయితే, వారి స్ఫూర్తితో పని మొదలుపెట్టిన తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాత్రం తగినంత సహకారం లభించలేదని అసంతృప్తి వెలిబుచ్చారు. అవినీతిని బయటపెట్టిన సందర్భంలో అభినందించడం పోయి, వేధింపులు పెరిగిపోయేవని వాపోయారు. ఎయిమ్స్లో చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా పనిచేసిన చతుర్వేదిని గత ఏడాది ఆగస్టులో ఆ పదవి నుంచి తొలగించారు. ఎయిమ్స్లోని అవినీతి బయటపెట్టినందుకు చతుర్వేదికి దక్కిన ‘బహుమతి’ అది! ఆ విషయాలను బుధవారం ఆయన గుర్తుచేసుకొని బాధపడ్డారు. ‘నన్ను ఎందుకు తొలగించారనేది తెలుసుకొనేందుకు ఆర్టీఐ ద్వారా ప్రయత్నించాను. తెలిసింది ఏమిటంటే ప్రధాని నా విషయాన్ని ఆరోగ్య మంత్రి హర్ష వర్థన్తో చర్చించారు. అయితే, ఆయనకు నామీద తప్పుడు నివేదిక ఇచ్చి.. సస్పెండ్ చేయించారు’’ అని వివరించారు. ఇప్పుడు చతుర్వేది ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. అవినీతి వ్యవహారాన్ని బయటపెట్టిన ప్రతి సందర్భంలోనూ పీఎంవో తీరు తనను నిరుత్సాహపరిచేదని చతుర్వేది తెలిపారు. ‘‘ఎయిమ్స్ అక్రమాలపై సమగ్ర వివరాలను పీఎంవోకు అందించాను. కానీ, సమగ్ర దర్యాప్తు జరపాలన్న తన విజ్ఞప్తిని పట్టించుకోలేదు’’ అని వాపోయారు. ఐదేళ్లలో 12 సార్లు బదిలీ అయ్యారంటేనే..ఆ వేధింపుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ‘వ్యయప్రయాసలకు ఒడ్డి సాహసం, పట్టుదల, రాజీపడని ఆదర్శప్రాయ వ్యక్తిత్వంతో ప్రజా సంస్థల్లోని అవినీతిని బయటపెట్టారు’’ అని అవార్డు కమిటీ కొనియాడింది.. కాగా, మరో విజేత అన్షు గుప్తా కార్పొరేట్ సంస్థలో ఉద్యోగి. లక్షల్లో వేతనం, వడ్డించిన విస్తరి లాంటి జీవితం. అలాంటిది 1999లో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘గూంజ్’ను స్థాపించారు. ‘ఇచ్చే సంస్కృతి’ని పెంచినందుకుగాను ఆన్షును మెగసెసే కమిటీ అవార్డుకు ఎంపిక చేసింది. |
No comments:
Post a Comment