|
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): హిందూమతంలో సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద, ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందేనని మన శాస్త్రాలు చెబుతున్నాయని, అంతేతప్ప వాటికి తొలగించుకోవడానికి షార్ట్ కట్స్ ఏమీ లేవని ఇరువురూ అంగీకరించారు. ఈనెల 18 వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ఆర్కే రాసిన కొత్తపలుకు ‘ఏది పాపం? ఏది పుణ్యం?’ హిందూ విశ్వాసులలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆ వ్యాసంలో తనకు అభ్యంతరకరమైన అంశాలున్నాయని, వాటిపై చర్చిస్తానని పరిపూర్ణానంద, ఆర్కేకు వర్తమానం పంపారు. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇరువురి మధ్య ఏబీఎన్ చానెల్ బిగ్ డిబేట్ ఏర్పాటు చేసింది. వ్యాసంలోని అంశాలపై, పరిపూర్ణానంద ఆర్కేను ప్రశ్నించారు. అయితే తానూ హిందువునేనని, దాన్ని గర్వంగా చెప్పుకొంటానని ఆర్కే ఈ సందర్భంగా స్పష్టంచేశారు. హిందూ మతంలో లోటుపాట్లు ఏర్పడినపుడు ఒక హిందువుగా వాటిని ప్రశ్నించే హక్కు తనకు ఉందని పేర్కొన్నారు.పరిపూర్ణానంద, ఆర్కే మధ్య చర్చ సారాంశం ఇదీ....
పరిపూర్ణ: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించారు.దీనికి ప్రధాన కారణం చంద్రబాబు తప్పిదనమేనని కథనాలు వచ్చాయి. ముఖ్యంగా.. సాధారణ భక్తులు స్నానం చేసే ఘాట్లో చంద్రబాబు స్నానం చేయడం వల్ల రెండు గంటలు భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు షార్ట్ ఫిలిం తీయడం కూడా ఓ కారణమైంది. చంద్రబాబు బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారి జనాలను వదలడం కూడా కారణమైంది. అయితే ఈ అంశాలను పక్కదారి పట్టిస్తూ చంద్రబాబుది తప్పులేదు అని చెప్పడానికి ఆర్కే ఇటువంటి వ్యాసాలు రాశారన్నది ఆరోపణ. దీనికి ఏమంటారు?
ఆర్కే: చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకొని కానీ.. ఆయనను తిడుతూ కానీ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆ ఘటనకు ప్రభుత్వ వైఫల్యం కారణమన్నది అందరికీ తెలిసిందే. అక్కడ ప్రభుత్వమంటే చంద్రబాబే. అక్కడ మంత్రులు నామమాత్రం. ప్రభుత్వం, మీడియా, స్వాములు చేసిన విపరీత ప్రచారం.. అది కూడా పొద్దున్నే వచ్చేసి స్నానం చేయాలని చెప్పడంవల్ల వచ్చిన అనర్థం ఇది. పుష్కరాల్లో స్నానం చేయకపోతే పాపులుగా మిగిలిపోతారని భయపెట్టడం ఎంతవరకు సబబన్నదే నా ప్రశ్న? ఆ రోజే స్నానం చేయకపోతే పాపం అని ఎందుకు చెప్పడం?పరిపూర్ణ: ఆ ప్రచారం చేయడంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పాత్ర లేదంటారా? ఆర్కే: నేను మీడియా అని చెప్పాను. అందులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఉంటుంది. ప్రతి వాళ్లకీ దీనిలో లో భాగం ఉందనే నేనూ చెబుతా? పరిపూర్ణ: తమను కించపరుస్తూ సినిమా తీశారని బ్రాహ్మణులు గతంలో ఆందోళన చేసినప్పుడు మీరు మీ మిత్రత్వాన్ని పక్కన పెట్టి కూడా వారికి మద్దతుగా నిలిచారు. మీ విశ్వసనీయత అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీరు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా? అసలు మీరు హిందువా? ఇలా వస్తున్న అనేక ప్రశ్నలకు మీరు ఏమని సమాధానం చెబుతారు?
ఆర్కే: ఆ లెక్కన చూస్తే నేను మీకంటే ఎక్కువ హిందువుని. ‘హిందువు అంటే మేమే’ అని మీరు అనుకుంటారు. సంస్కరణలు అవసరమా కాదా చెప్పండి?
పరిపూర్ణ: కచ్చితంగా కావాలి
ఆర్కే: వేదకాలంలో ఈ విగ్రహారాధన ఎక్కడ ఉంది? తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగుడి ఉందా? మనమీద మనం అదుపు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది దేవుడు. నమ్మేవాళ్లు నమ్ముతారు నమ్మని వాళ్లు నమ్మరు.పరిపూర్ణ: మీరు దేవుడిని నమ్ముతారా? ఆర్కే: కచ్చితంగా నమ్ముతా. అయితే మూఢత్వాన్ని వ్యతిరేకిస్తా.ఫలానా పనిచేస్తే పాపాలు పోతాయని ఏ శాస్త్రం చెప్పారు? పరిపూర్ణ: ఎక్కడా అలా చెప్పలేదు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మశుభత్ అంటే ఏ కర్మనైనా అనుభవించాల్సిందే. అయితే ఇక్కడ విషయమేమిటంటే..మనం నడుస్తుంటే కాళ్లకింద అనేక క్రిములు చనిపోతాయి. ఇటువంటి పాపాలను నిత్య జీవితంలో మనకు తెలియకుండానే అనేకం చేస్తుంటాం. అటువంటి పాపాలకు ప్రాయశ్చితంగా పుష్కర స్నానం చేయడం.. దీక్షలు, ఉపవాసాలు ఆచరించడం వంటివి చేస్తాం. అంతేకానీ హత్య చేసి వచ్చి పుష్కర స్నానం చేస్తే పాపం పోతుందని ఎవరూ చెప్పరు. ఆర్కే: తమిళనాడులోని ఓ గుడికి వెళ్లి ప్రసాదం తీసుకువచ్చి నీళ్లలో కలిపి పిల్లలకిస్తే పరీక్షల్లో పాస్ అయిపోతాడని ఓ స్వామి చెబుతాడు. అలాదేవుడే పరీక్ష రాస్తే ఇక చదవడం ఎందుకు? అమ్మవారి ముఖం చూస్తే పంచమహాపాతకాలు పోతాయి అని చెబుతారు. అసలు అమ్మవారు ఎవరు నిర్వికార రూపమే కదా?మనల్ని నిగ్రహించుకోవడానికే ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అసలు గుడికి ఎందుకు వెళతాం? వేరే ఆలోచనలు రాకుండా మనమనసును లగ్నం చేసుకోవడానికి వెళతాం. అది మనం సృష్టించుకున్నది. అమ్మవారి ముఖం చూస్తే పాపాలు పోతాయని చెప్పడమేమిటి? పరిపూర్ణ: కోవెలలో.. గందానది రేవులలో.. రామకోటి రేఖలలో మాత్రమే లేడు.. ఎవ్వాని మది శుభ్రంగా కలదో అక్కడే కలడు పరమాత్మ అని నేను నా ప్రవచనాల్లో ఒకటి చెబుతుంటా. అయితే .. మీరు రాసిన దాంట్లో ప్రధాన ఆక్షేపణ ఏమిటంటే.. జరిగిన వైఫల్యాలపట్ల స్వాములు ఎందుకు స్పందించలేదన్న వాదన మీరు చేశారు. అయితే ఈ ఘటన జరగడానికి రెండు మూడు రోజుల ముందు మీరు ఇలాంటి అంశాలపై నేను స్పష్టతనిచ్చా. ఇదే విషయాన్ని పుష్కరాలకు ముందే ఎవరినైనా విజ్ఞులను పిలిచి ఏబీఎన్ చర్చపెట్టి ఉండొచ్చుకదా? ఆర్కే: మీడియా ప్రభావం కానీ, ప్రవచనకారుల ప్రభావం జనాలపై ఇంతలా ఉంటుందని నేను ఊహించలేదు. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం 11 కోట్లమంది స్నానాలు చేశారని లెక్కతేల్చారు.ఇంతమంది స్నానాలు చేయాలని చెప్పారుగానీ గోదావరిని పరిరక్షించండి అని ఒక్కరైనా చెప్పారా?
పరిపూర్ణ: ఇదే అంశాన్ని పుష్కరాలకు ముందే నేను చెప్పాను. మట్టివేయకండి అని స్పష్టం చేశాను. మట్టి ఎందుకు వేయాలి? మట్టి నీళ్లల్లో మేట వేసేది. అందుకని అందులోని మట్టిని తీసి గట్టున వేయాలని చెప్పారు. ఆ రోజు ఆవశ్యకత అది. కానీ ఈ రోజు అవసరం లేదు. దీనిని నేను బహిరంగంగా ఖండించాను. అటువంటి ఖండనలను ప్రసార మాధ్యమాలు సరిగా తీసుకెళ్లలేకపోయాయి.
ఆర్కే: గుంపులో గోవిందంలో మీడియా కూడా భాగమే. అది ఎక్కడనుంచీ ఊడిపడలేదు. మేం కూడా ఉదయం నుంచి సాయంత్రందాకా లైవ్లు పెట్టి ప్రసారం చేశాం. కానీ మాబాధ్యతకంటే మీ బాధ్యత ఎక్కువ కదా? చాలామంది ప్రవచనకారులు .. పాపపరిహారార్థం అని చెబుతుంటారు. కానీ పాపం చేయొద్దని చెప్పరు. ఎందుకు?
పరిపూర్ణ: హిందూమతంలో సంస్కరణలు చేపట్టాలన్నదే నా అభిప్రాయం కూడా. ఏ ఇతర మతం కూడా సంస్కరణలకు ఒప్పుకోదు. ఒక్క హిందూమతం మాత్రమే సంస్కరణలు చేసుకుంటోంది. సతీసహగమనం, వితంతు వివాహం వంటి ఎన్నో సంస్కరణలను కాలానుగుణంగా చేపట్టింది. మీరు మాట్లాడిన అంశాల్లో అన్నీ సరిగానేఉన్నాయి కానీ జనరలైజ్ చేసి రాశారన్నదే ప్రధాన ఆరోపణ?ఆర్కే: నేను రాసిన వ్యాసాలపై విభేదించేవాళ్లు కూడా ఉండొచ్చు దానిని నేను తప్పు పట్టను. అయితే ఇంతమంది ప్రవచనాలు చెబుతున్నప్పుడు ‘నేను ఈ పనిచేయడం పాపం’ అని ప్రజలు ఎందుకు భావించడంలేదు.? పరిపూర్ణ: సమాజంలో రెండు వర్గాలుంటాయి. అవినీతికి పాల్పడేవాళ్లంతా ప్రవచనాలు వింటారని చెప్పలేం. ప్రవచనాలు వింటేనే అందరూ మారిపోతారనుకుంటే ఏసుక్రీస్తు చెప్పినప్పుడే యూదులంతా మారిపోవాలి. ఆర్కే: పోప్ సంవత్సరానికి ఒకసారి వాటికన్ సిటీలో ఓ పదిమంది చిన్నారుల కాళ్లుకడిగి స్పృశిస్తాడు. దానికి భిన్నంగా మనం ఇక్కడ కాళ్లు కడిగించుకుంటున్నాం. ఎలా సమర్థనీయం? ఇటీవల కొంత మంది పీఠాధిపతులు తమను దేవుళ్లుగా కొలిచే భక్తుల ఇళ్లకు వెళ్లి కాళ్లు కడిగించుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా చేయవచ్చని ఏ వేదాల్లో చెప్పారు? ఇలా అయితే అసలు దేవుళ్ల పరిస్థితి ఏమిటి? పరిపూర్ణ: హిందూమతంలో ఉన్న భావుకత మీకు అర్థం కావాలి. ఇక్కడ దేవుడికన్నా గురువు గొప్పవాడు. అయితే గురువు శిష్యుడిని గమ్యాన్ని చేర్చేలా ఉండాలి. కానీ తనే గమ్యం కాకూడదు. అందరూ హిందువులను టార్గెట్ చేస్తున్నారు. ఎవరూ ముస్లిం, క్రిస్టియన్లును ప్రశ్నించడం లేదు.ముస్లింలు మొహరం సందర్భంగా బ్లేడ్లతో కోసుకుంటారు., క్రైస్తవులు ఏర్పాటు చేసే స్వస్థత సభల్లో రోగాలు తగ్గుతాయంటూ ప్రచారం చేస్తారు. ఇటువంటివాటిపై మీరు ఎందుకు మాట్లాడరు?
ఆర్కే: మహ్మదీయులను ఆదర్శంగా తీసుకుంటానంటే నాకు అభ్యంతరంలేదు. ముస్లిం మతం మన దేశంలో మైనారిటీ. వారు మెజారిటీ ఉన్న పలు దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. అది గొప్పా? అటువైపు మనం వెళ్లాలా?? స్వస్థత సభల్లో వ్యాధులు నయం అవుతున్నాయన్న అంశంపై కూడా మేం త్వరలో మాట్లాడతాం. కేన్సర్ కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. అదీ తప్పే ఆరోగ్యం బాగోకపోతే క్రైస్తవ మత పెద్ద పోప్కూడా ఆస్పత్రిలో చేరుతారుకదా. భగవంతుడికి పూజ చేస్తేపాపాలు పోతాయని ఎక్కడ చెప్పారు. చేసిన కర్మ అనుభవిస్తేనే పోతుందని భగవద్గీతలోనే చెప్పారు కదా.
పరిపూర్ణ: భక్తిని మీరు మాఫియాగా అభివర్ణించారు. అలాఎలా అవుతుంది?
ఆర్కే: భక్తి అనేది ఒక అపురూపమైన భావన. అది ఒక వ్యక్తికి సంబధించిన అనుభూతి. అయితే పూజలు చేయకపోతే ఏదో జరుగుతుందని కొంతమంది భయపెడుతున్నారు. అఫలానా పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని చెప్పి ప్రలోభ పెడుతున్నారు. భయపెట్టి భక్తి వైపు మళ్లించడాన్ని మాఫియానే అంటారు. మన మనసుపై నియంత్రణ కోసమే భక్తికదా ఇలా చేస్తే మీకు క్రైస్తవ కూటాలకు తేడా ఏముంటుంది?వాళ్లూ విదేశీ విరాళాలు తెచ్చుకుని ప్రచారం చేస్తూ జనాలను మభ్యపెడుతున్నారు. మీరు పాపపుణ్యాలపేరుతో మభ్యపెడుతున్నారు.పరిపూర్ణ: జనవిజ్ఞానవేదిక వంటివాళ్లు హిందూ ధర్మం గురించే మాట్లాడతారు. క్రైస్తవ స్వస్థత సభలగురించి ఎందుకు మాట్లాడరు? ఆ భయమెందుకు? ఆర్కే: ఇది సాధారణంగా తలెత్తుతున్న ప్రశ్న. ఇది మీ దేశం అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మనం సరిద్దుకోవాలి. నేను క్రిస్టియన్ కాదు. ముస్లింని కాదు. హిందువుని కాబట్టి నా మతంలో జరిగిన తప్పును చెబుతాను. పరిపూర్ణ: పుష్కరాల్లో దళితులు రావడంలేదని మీరు రాశారు. అంటే మీరేమైనా సర్వే చేయించుకుని దళితులు రాలేదని చెప్పారా అన్నది అందరిలోనూ సందేహం?లేక ప్రభుత్వం దగ్గర సమాచారముందా? ఆర్కే: మా దగ్గర ఎంతోమంది పనిచేస్తుంటారు. వారిని అడిగినప్పుడు ఇది మాది కాదు అని వారు చెప్పారు. కొంతమంది హిందూ మఠాధిపతులు దళితులనేకాదు మనుష్యులనే ముట్టుకోరు. కులంతో సంబంధంలేకుండా అందరితోనూ ఇలానే వ్యవహరిస్తారు. నేను విలేకరిగా ఉన్నప్పుడు చిన్నజీయర్ స్వామి.. ప్రసాదాన్ని చేతిలో ఎత్తివేశారు. అంటే నన్ను తాకడానికి ఆయన ఇష్టపడలేదు. పీఠాఽధిపతుల్లో అంటరానితనం భావనేంటి? ఇది మనుష్యుల పట్ల అపచారం కాదా? పరిపూర్ణ: ఆయా స్వాములకు ఉండే నిత్య అనుష్ఠానం వల్ల వారు ఇతరులను తాకరు. తనకు సహాయం చేసే వ్యక్తిని కూడా తాకరు. దళితులనే కాదు బ్రాహ్మణులను కూడా తాకరు. తోటి పీఠాధిపతులను కూడా వారు ముట్టుకోరు. చినజీయర్ స్వామికి చానల్లో వాటాలున్నాయని మీరు రాశారు. పరిపూర్ణానంద చానల్ పెడుతున్నారని రాశారు. మరి క్రైస్తవులకు 12 చానళ్లు, ముస్లింలకు చానళ్లు ఉన్నాయి కదా. మేం చానళ్లు పెడితే తప్పేంటి? మేం ఏం చేసినా ధర్మప్రచారానికే కదా? ధర్మప్రచారానికి ఏబీఎన్ అండగా ఉంటుందా?
ఆర్కే: ధర్మప్రచారం చేసినంత వరకు ఏబీఎన్ అండగా ఉంటుంది. మీతో కలిసి నడుస్తుంది. ఎవరు చానళ్లు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. అవసరమైతే మా చానల్ను కూడా ఇచ్చేస్తా తీసుకోండి. త్వరలో హిందూమతంలో సంస్కరణలపై పూర్తి స్థాయి చర్చ జరపడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
|





No comments:
Post a Comment