నాకిప్పుడు ముగ్గురు పిల్లలు
01-01-2016 01:19:46
హెరిటేజ్ ఇండీస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బ్రాహ్మణి మాట్లాడుతుంటే- సెమినార్లలో ప్రజంటేషన్ ఇచ్చేయువవాణిజ్యవేత్తలా అనిపిస్తారు. తాను చేసే ప్రతి పనిలో నిబద్ధత ఉండాలనుకొనే బ్రాహ్మణి కొత్త సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారో.. 2015 ఎలాంటి అనుభవాలను మిగిల్చిందో ‘నవ్య’తో పంచుకున్నారు.
బాల్యంలో అమ్మ నాకు అలెగ్జాండర్ కథ చెప్పింది. అలెగ్జాండర్ చివరి రోజుల్లో అనుచరులను పిలిచి తన సంపదనంతా ప్రజలకు పంచి పెట్టమంటాడు. చనిపోయిన తర్వాత ఒక చేయి ఆకాశానికి చూపించేలా సమాధి చేయమంటాడు. అలెగ్జాండర్ కోరికలకు రెండు కారణాలు చెబుతారు. తాను తన చుట్టు పక్కల ఉన్న సమాజం నుంచి ఏది సంపాదించాడో, దానిని వెనక్కి తిరిగి ఇవ్వటం ఒకటి. తాను ఈ భూమి మీద నుంచి ఏదీ పట్టుకుపోవటం లేదని చెప్పటం రెండోది. ఈ కథ నాకెప్పుడూ గుర్తుకొస్తుంటుంది. మనకు చుట్టూ ఉన్న సమాజం ఇచ్చిన దానికి ప్రతిగా ఎంతో కొంత ఇవ్వాలి. ముఖ్యంగా ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, మహిళల సాధికారత- ఈ నాలుగు అంశాలలో మార్పు తేవాలనేది మా లక్ష్యం. దీనిని హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ల ద్వారా సాధించాలనుకుంటున్నా.
‘‘మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2015 చాలా ఆనందంగా గడిచింది. దేవాంశ్ పుట్టడం ఒక పెద్ద మలుపు. హెరిటేజ్ వాల్యుయేషన పెరగటం మరో ముఖ్యమైన ఘట్టం. ప్రస్తుతం నాకు ముగ్గురు పిల్లలు. ఒకరు దేవాంశ్. రెండోది హెరిటేజ్. మూడోది ఎన్టీఆర్ ట్రస్ట్. ప్రస్తుతం నా ప్రపంచమంతా ఈ మూడింటితోనే. 2016లో కూడా ఇదే కొనసాగుతుందనుకుంటున్నా. దేవాంశ్ పుట్టిన తర్వాత మా జీవితాల్లో అనేక మార్పులొచ్చాయి. తనని చూసి మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. ఒక్కోసారి- మనం కూడా పిల్లల్లా ఉండలేమా అనిపిస్తుంది. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్కల ప్రపంచం నుంచి నేర్చుకొనే ఆసక్తి తగ్గుతూ వస్తుంది. ఆ ఆసక్తిని కోల్పోకూడదు. నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లో ఇది కూడా ఒకటి. దేవాంశ వచ్చిన తర్వాత మా ఇల్లంతా మారిపోయింది. అందరి దృష్టి తనమీదే. దేవాంశకు అందరూ ఇష్టమే. నా దగ్గర చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాడు. లోకేష్ దగ్గర చాలా ఆనందంగా ఆడుకుంటాడు. ఇక నాయనమ్మ(భువనేశ్వరి) ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది కాబట్టి చాలా ఇష్టం. తాత విషయం చెప్పాల్సిన అవసరం లేదు. దేవాంశ పాకడం నేర్చుకుంటున్నాడు. మొన్నీమధ్య దేవాంశ్ పాకుతుంటే మామయ్య(చంద్రబాబు) కూడా పాకా రు. అప్పుడు తన ఎగ్జయిట్మెంట్కి హద్దులు లేవు.
పైన చెప్పినవన్నీ ఒక దానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. మన దేశంలో పౌష్టికాహారలోపంతో బాధపడే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. వీరికి బలవర్థకమైన ఆహారం అందించాలంటే మంచి ఉత్పత్తులు ఉండాలి. దీనిని హెరిటేజ్ చేస్తుంది. ఇక విద్య, మహిళా సాధికారత విషయాలకొస్తే మన దగ్గర చాలా తక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరి సంఖ్య పెరిగితే- మహిళల కోసం అమలు చేసే విధానాలు పరిపుష్టమవుతాయి. ఇక్కడ మీకో ఉదాహరణ చెప్పాలి. ఈ మధ్య గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న స్టూడెంట్స్కు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలనుకున్నాం. 120 సీట్లు ఉంటే 22 వేల అప్లికేషన్స వచ్చాయి. వీరిలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళా సాధికారత ఎలా సాధిస్తాం. ఈ పరిస్థితి మెరుగుపరచటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. తెలంగాణాలో విద్యార్థినుల కోసం ఒక మహిళా కళాశాల ప్రారంభించాం. ఇలాంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.’’
- టైమ్ మేనేజ్మెంట్- ఇది నా కొత్త సంవత్సరం రెజల్యూషన్. దేవాంశ్ పుట్టిన తర్వాత వర్క్లైఫ్ మేనేజ్మెంట్ కష్టమవుతోంది. కొత్త సంవత్సరంలో నా టైమ్ను మరింత సమర్థంగా మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నా.
- కొత్త సంవత్సరం చాలా ఉత్సాహంగా ఉంటుందనుకుంటున్నా. యువ వాణిజ్యవేత్తలకు ఇది మంచి సమయం. మన దేశ జీడీపీ చాలా బాగుంది. వ్యాపారం చేయటానికి, కొత్త కొత్త ఆలోచనలను అమలు చేయటానికి అనేక అవకాశాలున్నాయి. అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి.
- పారదర్శకత- ఈ లక్షణమంటే నాకు చాలా గౌరవం. మన జీవితంలో ప్రతి విషయంలోను పారదర్శకత ఉండాలనుకుంటా. దీనిని మా కుటుంబం అంతా పాటిస్తాం. ఆస్తులను ప్రకటించిన అతి కొద్ది రాజకీయ కుటుంబాల్లో మాది కూడా ఒకటి.
- ప్రస్తుతం మా ఇంట్లో ఇద్దరు మంచి రాజకీయవేత్తలున్నారు. ఇంకో రాజకీయవేత్త అవసరం ఉందనుకోవటం లేదు. నేను రాజకీయాల్లోకి రావాలనుకోవటం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందించటానికి ఇది సరైన సమయమనుకుంటున్నా.
No comments:
Post a Comment