ఆదివారం - కాశ్మీరు శాలువాలు
వేదశాస్త్రాభివృద్ధికై జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారదేశంలో శ్రీకౌత సూర్యనారాయణ పంతులుగారు అగ్రగణ్యులు, వేద విజ్ఞాన అభివృద్ధి, ప్రచారం కోసం 100 సంవత్సరములకు పూర్వమే శ్రీదేవి శారన్నవరాత్ర వేదశాస్త్రసభను స్థాపించి, అవిచ్చిన్నముగా వేదాధ్యాపకులను, విద్యార్థులను సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నది కౌతా వారి వంశం. వారి వంశములో మూడోతరములో కూడా క్రమంతప్పకుండా నడిపిస్తున్న శ్రీ లలితమానోహరుగారి యొక్క అనుభవములు మహాస్వామి వారితో,
సికింద్రాబాదు మా ప్రాంగణములో ఒక ఆదివారంనాడు మధ్యాహ్నం నాకు కబురుపంపినారు. వెళ్లి వందనము చేయగానే "ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతున్నది రేపు సమాప్తి. నాకు వెంటనే ఆరు కాశ్మీరు పండిత శాలువాలు కావాలి. రాత్రి విమానంలో ఢిల్లీకి పంపవలెను" అని అన్నారు. దానికి నేను "ఈరోజు ఆదివారము, దుకాణములు తెరువబడి ఉండవు అవి దొరుకుట సాధ్యమా!" అని అంటే "అందుకే నీకు చెబుతున్నాను, ప్రయత్నం చెయ్యి" అని మందహాసము చేసినారు. 1968 సంవత్సరములో హైద్రాబాదులో మన సంస్కృతి, సంప్రదాయాలు అంతగా విస్తరించలేదు.
కొంచం బాధపడుతూ ఒక కొట్టు యజమాని ఇంటికి ఫోను చేసాను. అతను కొట్టు తెరవడానికి అంగీకరించి నన్ను రమ్మని రమ్మనినాడు. వెళ్లి ఆకొట్లో శాలువాలు పెట్టు బీరువాను తెరిచి, కట్టను విప్పి చూడగా శ్రీవారు కోరిన శాలువాలు సరిగ్గా 6 మాత్రమే అందులో ఉన్నాయి. చాలా ఆశ్చర్యము వేసినది, సంబరపడుతూ తెచ్చి శ్రీవారికి చూపించాను " నేను అనుకున్నవి దొరికినవి కదా" అని అన్నారు. ఆ రాత్రి వాటిని విమానంలో ఢిల్లీకి పంపుట, అవి మరునాడు సకాలములో యాగశాలకు చేరుట జరిగినది. ఎంతైనా శ్రీవారు సంకల్ప సిద్దులు కదా.
--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తక సౌజన్యంతో
No comments:
Post a Comment