సినిమా నాకు ఉద్యోగము కాదు, జీవితమూ కాదు
Updated : 31-Jul-2016 : 11:05
ఇరవైయ్యో శతాబ్దంలోని సినిమాల్లోనూ సంప్రదాయం, విలువలు అన్నో ఇన్నో చూడగలుగుతున్నాం అంటే వాటిని నమ్మి ఆచరించే కృష్ణవంశీ వంటి దర్శకులు ఉండడం వల్లే. సినిమాల్ని హాట్ కేకుల్లా తీసి అమ్మేస్తే ఓవర్ నైట్ కరోడ్పతిగా మారిపోవచ్చు. కానీ సినిమా ద్వారా వచ్చే కోట్లు కంటే.. కనీసం పదిమందిలోనైనా ఓ మంచి ఆలోచన రేకెత్తిస్తే చాలనుకునే దర్శకుడాయన. అందుకే దర్శకుడిగా తొలి సినిమా (గులాబి 1995) విడుదలై ఇరవై ఏళ్ళు కావస్తోన్నా ఆయన సినిమాల సంఖ్య ఇరవై కూడా దాటలేదు. దీనికి ఆయనిచ్చే సమాధానం ‘సొమ్ము, సంఖ్య నా టార్గెట్ కాదు’. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ సినిమాని తెరకెక్కిస్తోన్న కృష్ణవంశీ ఓ ప్రముఖ పత్రికతో సంభాషిస్తూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ఓ సినిమాకి తీసుకునే సమయంపై ఆయన వివరణ ఇస్తూ.. సినిమా నాకు ఉద్యోగము కాదు, జీవితమూ కాదు. సినిమాకి ఓ మంచి పాయింట్ కావాలి. దానికోసం అవసరమైనంత సమయం తీసుకుంటా. అది నెలైనా, ఏడాదైనా అని చెప్పుకొచ్చిన కృష్ణవంశీ డబ్బు కోసమే బతకాలంటే దానికి అంతెక్కడంటూ ప్రశ్నించారు. నిర్మాత కోసమో మరొకరి కోసమో సినిమా తియ్యలేను. అలా తీస్తే అది వ్యభిచారమే అవుతుంది. అంతమాత్రాన నేనెక్కువ అవతలి వాళ్ళఉ తక్కువ అని అనను. ఎవరి దారి వాళ్ళది. నావరకు నా సినిమాలు ప్రేక్షకులలో ఓ మంచి భావాన్ని కలిగిస్తే చాలు. నన్ను మోసం చేసిన నిర్మాతలు కూడా ఉన్నారు. సినిమాకి డబ్బులొచ్చినా రాలేదని చెప్పి నా దగ్గర్నుండి వసూలు చేశారు. ఒకాయనైతే నాతో సినిమా చేయాలని పట్టుబట్టి తన నాలుగైదేళ్ళ కూతురుపై ఒట్టేసి మరీ సినిమా తీయించుకున్నాడు. ఫలితం 4 కోట్లకు శఠగోపం. అతడు చేస్తున్న మోసం తెలిసినా సెంటిమెంట్కి కట్టుబడ్డాను. దాంతో వాడు అంబానీ కాలేదు. నేను రోడ్డునా పడలేదు. మంచిగా ఉంటే మరో సినిమా చేసేవాడ్నేమో.
కంటెంట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాను. అనుకున్నదాన్ని అనుకున్నట్టు తెరకెక్కించాల్సిందే. ‘మురారి’ విషయంలో ‘‘సినిమా ఎండింగ్లో పెళ్ళి పాట ఏంటండీ’’ అని నిర్మాత సహా చిత్ర బృందమంతా అన్నారు. అలా చేయడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడారు. కారణం అప్పటికే సినిమా ఎండింగ్లో మసాలా సాంగ్ ఫార్ములా ఉండటమే. అయితే దర్శుకుడిగా నా పేరు మార్చి, మీకు నచ్చని పాట పెట్టి, నచ్చిన కొరియోగ్రాఫర్తో డ్యాన్సులు వేయించుకొని విడుదల చేసుకోమని చెప్పి వచ్చేశాను. నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇచ్చాను. అప్పుడు ‘‘అలా ఎలా..?’’ అని ప్రశ్నించారు. అయితే ఈ పాట ఉంటుందని చెప్పాను. చివరికి ఆ పాట సినిమా స్థాయిని దాటి జనాలకు చేరువైంది. డైరెక్టర్గా నేను ఫెయిల్ అయినా నేను నమ్మిన కంటెంట్ ఫెయిల్ అవకూడదు.
2003లో హీరోయిన్ రమ్యకృష్ణను ప్రేమించి పెళ్ళి చేసుకున్న కృష్ణవంశీ తన భార్య ‘ఏంజల్’ అని కితాబిచ్చారు. ఆ ప్రేమ వ్యవహారం చెప్పమంటే మాత్రం ‘అది అమ్ముకునే ఐటమ్ కాదని’ చెప్పడం ఆయన నైజానికి ప్రతీక. ‘ఖడ్గం’ లాంటి సూపర్హిట్ తర్వాత చేసిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాకి నిర్మాతగాను మారిన కృష్ణవంశీ భార్య రమ్యకృష్ణ సొమ్మును వాడుకున్నట్టు వదంతులు పుట్టకొచ్చాయి. దానిపై స్పందించిన ఆయన ఇప్పటి వరకు ఆమె సొమ్మలో పైసా కూడా తీసుకోలేదు. ఆ పరిస్థితే వస్తే.. నేను చచ్చినట్టే లెక్క అని సమాధానమిచ్చారు. తమ పదకొండేళ్ళ కొడుకు గురించి చెబుతూ మా ఇద్దరి పోలికలు వాడికి వచ్చాయని, చాలా షార్ప్గా ఉండే రిత్విక్ నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడని చెప్పారు.
చివరిగా పవన్ కళ్యాణ్తో సినిమా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన పేరు వినపడితేనే కోట్లాదిమంది అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. గనక పవన్తో సినిమా అంటే.. కోట్లాదిమంది ఆయన అభిమానుల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అభిమానుల అంశాల కోసం నేను సినిమా తీయలేను. నేను రాసుకున్న కథకి ఆయన కావాలంటే అడగానికి ఏమాత్రం వెనుకాడనన్న కృష్ణవంశీ నాకు స్టార్ అయినా నాన్ స్టార్ అయినా ఒకటే. హీరోని బట్టి నేను తగ్గను పెరగనన్నారు.
No comments:
Post a Comment