|
శ్రీకృష్ణునిగా మాస్టర్ ఎన్టీఆర్, సహదేవునిగా మాస్టర్ సౌమిత్ర బాలనటులుగా పరిచయమవుతున్న చిత్రం ‘దానవీరశూరకర్ణ’. ఆ ఇద్దరూ స్వర్గీయ నందమూరి జానకీరామ్ కుమారులు. శ్రీ సాయిజగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ పతాకాలపై చలసాని వెంకటేశ్వరరావు, జె. బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో సీడీలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. ఈ చిత్రానికి జె.వి.ఆర్. దర్శకుడు. గాయని కౌసల్య సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. బుధవారం రాత్రి ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆడియో సీడీలను హీరో ఎన్టీఆర్, థియేట్రికల్ ట్రైలర్ను హీరో కల్యాణ్రామ్ ఆవిష్కరించారు. కల్యాణ్రామ్ మాట్లాడుతూ ‘‘అన్నయ్య జానకీరామ్ కుమారులు రామ్, సౌమిత్ర బాలనటులుగా మీ ముందుకొస్తున్నారు. వారిని ఆశీర్వదించాలి, ఆదరించాలి. పిల్లలతో ఈ సినిమా తియ్యడం ధైర్యంతో కూడుకున్న విషయం’’ అని చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘మాకే ఎంతో గర్వంగా ఉంది. ‘రామాయణం’తో నేను, ‘బాలగోపాలుడు’తో కల్యాణ్ అన్న బాలనటులుగానే పరిచయమయ్యాం. అలాగే నాన్నగారు, బాలయ్య బాబాయ్ బాలనటులుగానే పరిచయమయ్యారు. మళ్లీ ఇప్పుడు నాలుగో తరం కూడా బాలనటులుగానే పరిచయమవుతున్నారు. చిన్న పిల్లలతో సినిమా తియ్యడం మాటలు కాదు. ‘రామాయణం’ చేసినప్పుడు ఎమ్మెస్ రెడ్డిగారు, గుణశేఖర్గారు ఎంత కష్టపడ్డారో చూశాను. అలాంటి కష్టమే ఈ సినిమా దర్శక నిర్మాతలు పడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రతో పాటు ఈ సినిమాలో నటించిన పిల్లలందరినీ ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నందమూరి అభిమానులు నన్ను దీవిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు మాస్టర్ ఎన్టీఆర్. కృష్ణునిగా నటించిన మాస్టర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకుంటారని దర్శకుడు జేవీఆర్ ఆకాంక్షించారు. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ హైలైట్గా నిలుస్తాయనీ, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ నెల 28న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.
|
No comments:
Post a Comment