హైదరాబాద్ సిటీ, మే 8 (ఆంధ్రజ్యోతి):‘అడ్వాన్స్ చెల్లించి సొంత ఇంటిని బుక్ చేసుకోండి. నిర్మాణం పూర్తయ్యేదాకా అద్దె పొందండి’... ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చే ఆఫర్! ‘అద్దె చెల్లించండి. కొన్నేళ్ల తర్వాత మీరే ఆ ఫ్లాటును సొంతం చేసుకోండి!’... ఇది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ‘రియల్’ ఆఫర్! అద్దె ఇళ్లలో ఉండే మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా ‘హైర్ అండ్ పర్చేజ్’ (అద్దె చెల్లించండి.. సొంతం చేసుకోండి) అనే పథకాన్ని ప్రారంభించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దీనిపై అడుగు ముందుకు వేయనుంది. నగరంలో మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు కలగానే మిగులుతోంది. ఎప్పటికీ అద్దె ఇల్లే గతి అవుతోంది. ఇలాంటివారిని ‘సొంతిటి’కి యజమానుల ను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా ‘గ్రేటర్’ పరిధిలోని ఖాళీ స్థలాల్లో బహుళ అంతస్తుల్లో డబుల్బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తారు. దానికయ్యే ఖర్చునుబట్టి అద్దెను, చెల్లించాల్సిన కాలాన్ని నిర్ణయిస్తారు. ఇప్పటిదాకా సొంత ఇల్లు లేని, నిర్ణీత డాక్యుమెంట్లు, నిబంధనలకు అంగీకరించిన వారికి ఫ్లాట్లను కేటాయిస్తారు. నిర్దిష్టకాలం అద్దె కట్టిన తర్వాత... ఫ్లాటు వారి సొంతమైపోతుంది. దీనిపై ఇంకా ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని... సర్కారు సరే అనగానే పక్కాగా పథకాన్ని రూపొందిస్తామని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, పేదలకు పక్కా గృహాలను ప్రస్తుతమున్నట్లుగా జీ+2లో కాకుండా... ఆరంతస్తుల్లో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్లో 2 లక్షల ఇల్లు అవసరమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించారు. గ్రేటర్లో స్థలాల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో... జీ+2 కాకుండా, ఎక్కువ అంతస్తులు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment