భక్తులను కాచే భద్రకాళి.....................
భద్రకాళి అంటే భక్తుల భద్రత చూసే కాళి. అంటే భక్తులను బ్రోచే తల్లి. భద్రకాళి అనగానే వరంగల్, వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో, ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు. అతి పురాతనమైన ఈ దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట. పూర్వం రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి వెళ్తూండేవాళ్ళుట. అలాగే చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ దేవిని పూజించి వెళ్ళాడుట. విజయం సాధించిన తర్వాత క్రీ.శ. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు.
తరువాత కాలంలో కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు. తదనంతరం కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఈ ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించాడు. (ఈ తటాకాన్ని ఇప్పటికీ చూడవచ్చు). అంతేకాదు, ఆలయ నిర్వహణకిగాను కొంత భూమిని కూడా ఇచ్చాడు. కాలగమనంలో ఢిల్లీ బాదుషా అల్లావుద్దీన్ ఖిల్జి చేతిలో కాకతీయులు ఓడింపబడటంతో, సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన ఈ దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది. ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి తర్వాత బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల సమయంలో ఈ దేవస్ధానం వైభవం ఇంకా క్షీణించింది..
క్రీ.శ. 1940లో శ్రీ గణపతి శాస్త్రి అనే దేవీ ఉపాసకులు కర్ణాటక నుంచి జీవనోపాధి వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ఆలయం చూసి, దానిని పునరుధ్ధరించాలనే కోరికతో ఆలయం పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని వున్నారు. ఆయన శ్రీ ముదుంబాయి రామానుజాచార్యులతో కలిసి స్ధానిక వర్తకులైన శ్రీ మగన్ లాల్ సమేజాగారిని కలిశారు. శ్రీ సమేజాగారికి కలలో అమ్మవారు కనబడి ఆలయాన్ని పునరుధ్ధరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారికి సహాయం చెయ్యమని ఆదేశించినదట. ఆ ఆదేశం ప్రకారం శ్రీ సమేజాగారు, ఇంకా ఇతర పెద్దలు కలిసి ఆలయ పునర్నిర్మాణం తలపెట్టి 1950 లో పూర్తిచేశారు.
No comments:
Post a Comment