దేశంలోకెల్లా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తగినంత ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ పథకంలో హైదరాబాద్ నగరాన్ని కూడా చేర్చి, ఏడాదికి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల నగరంలో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని కూడా ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ముంబాయి లాంటి మెట్రో సిటీ మాదిరిగానే, హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 625 కిలోమీటర్ల మేర విస్తరించిందని, ఈ నగరం ఎ-1 కేటగిరిలో ఉన్నదని సిఎం గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ పథకంలో హైదరాబాద్ ను ఎంపిక చేయడానికి బదులుగా నగరానికున్న అవసరాలు గుర్తించి, ప్రత్యేకంగా పరిగణించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.
‘‘కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2011లో నియమించిన డాక్టర్ ఐషర్ జడ్జ్ అహ్లువాలియా కమిటీ ఇచ్చిన నివేదికలో హైదరాబాద్ లో కీలక రంగాల్లో రూ.30,370 కోట్ల పెట్టుబడులు కావాలని, ప్రతీ ఏటా యాజమాన్య, నిర్వహణ ఖర్చుల కింద రూ.1,264 కోట్లు అవసరం అని పేర్కొన్నారు. కేవలం నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడానికి, మురికి నీటి కాల్వల నిర్మాణం, నిర్వహణకు రూ. 15వేల కోట్ల పెట్టుబడులు కావాలి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి.) ద్వారా సిగ్నల్ ఫ్రీ కారిడార్ల ఏర్పాటు కోసం రహదారుల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ది, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులకు రూ.20,661 కోట్లు కావాలి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఏడాదికి 100 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల హైదరాబాద్ అవసరాలు తీర్చడం సాధ్యం కాదు. రూ. 5,500 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)కు ఏడాదికి కేవలం వంద కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల చెప్పుకోదగిన పనులేవీ చేయడం సాధ్యం కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లాంటి ఎ-1 నగరాల అభివృద్ధి కోసం, ముఖ్యంగా మంచినీటి సరఫరా, డ్రైనేజి, రవాణా తదితర మౌలిక రంగాల కోసం ప్రత్యేక వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉంది’’ అని ఈ లేఖలో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు.
‘‘ హైదరాబాద్ నగరంలో 50 శాతం కుటుంబాలకు మురికి కాల్వల సదుపాయం లేదు. నగరంలో చాలా ఏళ్ల కింద నిర్మించిన మంచినీటి, మురుగు నీటి కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో కొత్త పైపులు వేయాలి. చాలా ప్రాంతాల్లో కొత్త పైపులైన్లు కావాలి. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుంటే హైదరాబాద్ నగర అవసరాలు తీర్చే నిధులు సమకూర్చుకోవడం తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందిగా మారుతుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
‘‘పై విషయాలను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ సిటీ జాబితాలో హైదరాబాద్ కు బదులుగా కరీంనగర్ నగరాన్ని ఎంపిక చేయాలని కోరుతున్నాను. దాదాపు మూడు లక్షల జనాభా కలిగిన కరీంనగర్, భౌగోళికంగా ఉత్తర తెలంగాణ నడిమధ్యలో ఉన్నది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ పట్టణం త్వరలోనే ద్వితీయశ్రేణి నగర జాబితాలో చేరబోతున్నది. స్మార్ట్ సిటీ పథకంలో కరీంనగర్ పట్టణాన్ని చేర్చడం వల్ల ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ కు బదులుగా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ, ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్జప్తి చేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు.
No comments:
Post a Comment