శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే, శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడని శివుని యొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని, పరమేశ్వరుడు పగటి రూపం గలవాడని.. అందుచేత దేవిని రాత్రిపూట అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్య పురాణం చెబుతోంది.
అశ్వని నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వయుజమాసము. శరదృతువులో ఇది మొదటి నెల. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులనీ ,దశమినీ విజయదశమి అని పండుగ చేసుకోవడం అనాదిగా ఉంది. తొమ్మిది రోజులు చేసుకునే పండుగ నవరాత్రి, దేవిని పూజిస్తారు కనుక శరన్నవరాత్రులని అంటారు.దీన్నే విజయదశమి అనీ పిలుస్తారు.
శ్రీ రాముడు రావణునితో యుద్ధం చేయడానికి వెళ్ళిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు ,జగన్మాత మహిశాసురుడ్న్నివధించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు,అజ్ఞాత వాసం పూర్తి అయిన తరువాత విజయుడు జమ్మిచెట్టులో దాచిన ఆయుధాలను తీసుకుని శత్రువుల్ని ఓడించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని పెద్దలు చెప్తారు.
ఈ దసరా తొమ్మిది రోజులు సుమంగళి పూజ ,కుమారిపుజ చేస్తారు. పదేళ్లలోపు ఆడపిల్లలకు తలంటు పోసి ,పిండి వంటలతో భోజనంపెట్టి ,కొత్త బట్టలుపెట్టి సత్కరిస్తారు.ఇళ్ళలోను ,దేవాలయల్లోను ,కలశపూజలు ,చండిహోమాలు శాస్త్రబద్ధంగా చేస్తారు. మూల నక్షత్రం సప్తమినాడు సరస్వతి పూజ ,అష్టమి నాడు దుర్గాపూజ ,సప్తమి నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. విజయ దశమి నాడు కొత్తగా ఏదైనా పని ప్రారంబిస్తే ఆ పని విజయవంతం మవుతుందని విశ్వాసం.విజయదశమి సాయంత్రం శమి శమియతే పాపం అని జమ్మి చెట్టును పూజిస్తారు.
No comments:
Post a Comment