భగవంతునిపై విశ్వాసం ఉంటేనే.. ఫలితం దక్కుతుంది
ఓ గ్రామంలో చాలాకాలంగా మచ్చుకు కూడా వర్షాలు లేవు. అందువల్ల ఊరిపెద్దలంతా ఓ మైదానంలో సమావేశమై శుభముహూర్తాన వానకోసం సామూహికంగా ప్రార్ధనలు చేద్దాం.. అని నిర్ణయించుకున్నారు.
వారు నిర్ణయించిన శుభముహూర్తం రానే వచ్చింది. అప్పుడు ఒక బాలిక ఆ సామూహిక ప్రార్ధనలో పాల్గొనడానికి గొడుగు పుచ్చుకుని వచ్చింది. ఆమె చేత గొడుగుతో రావడం చూసిన వారు ఆమెను ‘నువ్వెందుకు గొడుగు పుచ్చుకుని వచ్చావు?’ అని ప్రశ్నించారు.
అందుకు ఆ చిన్న పిల్ల “మనం ఇప్పుడు సామూహిక ప్రార్ధన చెయ్యబోతున్నాం కదా! ఆ ప్రార్ధన ముగియగానే వర్షం వస్తుంది. అందుకే గొడుగు తెచ్చాను” అంది ధీమాగా.
ఆ రోజు జరిగే సామూహిక ప్రార్ధనలో పాల్గొనడానికి వేలాదిమంది అక్కడకు వచ్చారు. కానీ వారిలో ఏ ఒక్కరికీ, ‘మనం భగవంతుణ్ణి ప్రార్థించబోతున్నాం. అందువల్ల ఖచ్చితంగా వర్షం వస్తుంది. ఇది తథ్యం’ అనే నమ్మకం ఏ కోశానా లేదు. నమ్మకం లేకుండానే వారు సామూహిక ప్రార్థన చేయడానికి వచ్చారని తేటతెల్లమవుతోంది.
వారికి, ‘తమ ప్రార్థన ఫలితంగా వర్షం వస్తుంది’ అనే పూర్తి నమ్మకం ఉండి ఉంటే, వారూ చేత గొడుగులతో వచ్చి ఉండేవారు. వీరి మాదిరిగానే లోకంలో అనేకులు ‘ తమ ప్రార్థన తప్పక ఈడేరుతుంది!’ అనే నమ్మకం లేకుండా, ఏదో మొక్కుబడిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అందువల్ల వారికి ప్రార్థన మూలంగా లభించే సత్ఫలితం ప్రాప్తించదు.
అతి కొద్దిమంది మాత్రమే ఆ చిన్నపిల్ల నమ్మినట్లు ‘మన ప్రార్థన తప్పక నెరవేరుతుంది!’ అనే పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. అటువంటి వారే ప్రార్థన మూలంగా లభించే సత్ఫలితాలను పొందుతుంటారు.
‘ప్రార్థన ద్వారా మనం ఆత్మబలం పొందడమనేది, మన ప్రార్థన ఏ మేరకు హృదయపూర్వకంగా చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. “ప్రార్థన చేసినప్పటికీ నీకు వైఫల్యం ఎదురైతే, నువ్వు ప్రార్థనను నిజంగా, మనస్ఫూర్తిగా చెయ్యలేదని తెలుసుకో” అని పెద్దలు చెబుతుంటారు.
No comments:
Post a Comment