డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ పరీక్ష నిర్వహణ, ఇంటర్ ప్రాక్టికల్స్లో జంబ్లింగ్పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కీలక నిర్ణయాలను ప్రకటించారు. టెట్ నోటిఫికేషన్ను మార్చిలో, డీఎస్సీ నోటిఫికేషన్ను ఏప్రిల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్లో ఈసారికి జంబ్లింగ్ పద్ధతి ఉండదని స్పష్టంచేశారు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ నెలాఖరులో డీఎస్సీ-2016 నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే కొత్త ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగిపోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఆ దిశగా తక్షణమే చర్యలు మొదలుపెట్టామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, డైరెక్టర్ జీ కిషన్, అడిషనల్ డైరెక్టర్ గోపాల్రెడ్డితో ఆయన సమీక్ష నిర్వహించారు.
డీఎస్సీ నోటిఫికేషన్ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీ-2016 పరీక్షలను జూన్ రెండో వారంలో నిర్వహిస్తామని చెప్పారు. జూన్ నెలాఖరులోనే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసి, జూలై రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించి, ఉద్యోగానికి ఎంపికైన వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తామని విద్యా మంత్రి కడియం తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను 75 రోజులలో పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈలోగా టెట్ పరీక్షల నిర్వహణ కూడా పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు. టెట్లో అర్హత సాధించిన వారినే డీఎస్సీ-2016లో అర్హులుగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను నోటిఫికేషన్తోపాటు విడుదల చేస్తామని వివరించారు.
ఆర్థికశాఖ ఆమోదంతో టీచర్ పోస్టుల ప్రకటన:
డీఎస్సీ-2016 ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని మంత్రి కడియం తెలిపారు. జిల్లాల వారీగా ఈ వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీల వంటి అన్నిపోస్టులకు కలిపి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో సబ్జెక్టుల వారీగా నియామకాలు ఉంటాయని తెలిపారు.
రాష్ట్రంలో ఖాళీల వివరాలు:
డీఎస్సీ-2016 ద్వారా మొత్తం 20 వేలకు తక్కువ కాకుండా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో పాఠశాల విద్యాశాఖలో దాదాపు 15 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశాలున్నాయి. అందుకు సంబంధించిన ఖాళీల సేకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో కలిపి మొత్తం 20 వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే సొసైటీల పరిధిలో ఉన్న టీచర్ ఖాళీలను కూడా డీఎస్సీ ద్వారా భర్తీ చేయవచ్చా? లేదా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులు జిల్లాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ప్రస్తుత ఖాళీలు 10,961 అని తెలుస్తున్నది.
పాత డీఎస్సీలపైనా కసరత్తు:
1998 నుంచి 2012 వరకు ఉన్న పాత డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల పైనా కసరత్తు చేశామని విద్యాశాఖ మంత్రి కడియం తెలిపారు. అయితే ఈ పోస్టుల భర్తీపై న్యాయ సలహాలు తీసుకుంటున్నామని, ఆర్థికశాఖ ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాత డీఎస్సీల ద్వారా నష్టపోయిన విద్యార్థులకూ ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
వేర్వేరుగానే టెట్, డీఎస్సీ నిర్వహణ:
ఏప్రిల్ రెండో వారంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించనున్నట్లు కడియం ప్రకటించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టెట్ నిర్వహణకు సంబంధించి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ మేరకు ఏప్రిల్ మూడోవారంలో ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు. ఈసారి టెట్ జవాబు పత్రాలు ఓఎంఆర్ షీట్ రూపంలో ఉంటాయని అన్నారు. వాటిని కంప్యూటర్ ద్వారా మూల్యాంకనం చేస్తామని ఆయన తెలిపారు. టెట్, డీఎస్సీ పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తామని చెప్పారు. టెట్లో అర్హత సాధించిన వారికే డీఎస్సీలో అవకాశం కల్పించనున్నామని ఆయన తెలిపారు. రెండు పరీక్షలను కలిపి నిర్వహించడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాలు అధికారులు వెలిబుచ్చారని, ఈ అంశంపై అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే టెట్, డీఎస్సీని వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం కడియం తెలిపారు.
ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ :
ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. జంబ్లింగ్లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యార్థులు నష్టపోయే పరిస్థితులున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జంబ్లింగ్ వల్ల రాష్ట్ర విద్యార్థులకు మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఇంటర్లో ఒక్కమార్కు తగ్గినా.. ఐఐటీ-జేఈఈ వంటి జాతీయ పరీక్షలలో మంచి ర్యాంకులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
ఇలాంటి అంశాలన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రస్తుత విద్యా సంవత్సరానికి జంబ్లింగ్ను రద్దు చేశామని తెలిపారు. పైగా ఈ విద్యా సంవత్సరం నుంచే జంబ్లింగ్ విధానాన్ని అమలు పరచడానికి ప్రైవేటు జూనియర్ కాలేజీలు సిద్ధంగా లేవని అన్నారు. ఈ మేరకు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో జంబ్లింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసున్నామని తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణలో మాత్రం జంబ్లింగ్ తప్పనిసరిగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని కడియం స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించక పోవడం వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయని, ఎంసెట్, ఐఐటీ వంటి ప్రవేశ పరీక్షలలో ప్రైవేటు విద్యార్థులే అధిక సంఖ్యలో ఎంపికయ్యే పరిస్థితులున్నాయని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పీ మధుసూదన్రెడ్డి అన్నారు.
జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించలేక పోతే.. ఎంసెట్ వెయిటేజీ నుంచి కూడా ప్రాక్టికల్ మార్కులను మినహాయించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జంబ్లింగ్పై సానుకూలంగా నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు నరేందర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తుల మేరకు సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జంబ్లింగ్ను ఈ ఏడాదికి రద్దు చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment