మోదీకి సెగ ఎందుకు తగల్లేదంటే....
18-11-2016 13:50:56
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తాత్కాలిక ఇబ్బందుల కారణంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ... ప్రభుత్వంపై ప్రత్యేకించి ప్రధాని మోదీపై ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో... బ్యాంకుల ముందు జనాలు భారీ ఎత్తున క్యూలు కట్టి పడిగాపులు కాస్తున్నారు. మొట్టమొదటి సారి భారత దేశంలో ఆర్ధిక సంక్షోభం తలెత్తింది ప్రజల వద్ద డబ్బుల్లేక కాదు... అవసరాలకు తగినంత డబ్బు అందుకోలేక. దీంతో పాటు... పలుచోట్ల క్యూల్లో వృద్ధులు మరణించారనీ, పేదలు విషాదంలో మునిగి పోయారనీ... రెస్టారెంట్లు, షాపింగ్మాల్స్ సంక్షోభంలో పడ్డాయనీ... సెక్స్ వర్కర్లకు పనే లేకుండా పోయిందన్న కథనాలు కూడా తరచూ వినవస్తున్నాయి. అవును జనాలంతా ఆక్రోశంతో రగిలిపోతున్నారు. అయితే అందుకు నరేంద్రమోడీని శిక్షించేందుకు మాత్రం సిద్ధంగా లేరు. అలా ఆయన ముందుగానే ఈ మార్పు కోసం దేశాన్ని సిద్ధం చేశారు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషమేమంటే... పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని గనుక మండు వేసవిలో తీసుకుని ఉంటే మాత్రం హింసాత్మంగా కూడా మారేదేనని చెబుతున్నారు. అప్పుడు మోదీ ఇంత ధీమాగా ఉండే అవకాశం ఉండకపోయేదే! ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలు భావించడంతో... దీన్ని వివాదం చేయడం వైరివర్గాలకు కూడా కష్టంగా మారిందంటున్నారు. భారత మీడియా సైతం పెద్దనోట్ల రద్దుపై తటస్థంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనం. దీర్ఘకాలిక ప్రయోజనాలను కళ్లకు కట్టినట్టు ప్రజలకు చెబుతూ.. ప్రభుత్వం సైతం విస్తృతంగా ప్రచారం చేయడం కూడా వ్యతిరేకతను సద్దుమణచగలిగింది. అందుకే ప్రభుత్వం నిర్ణయం కారణంగా తమకు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పట్టణాల్లోని కొన్ని వర్గాలు మినహా సాధారణ ప్రజలు పూర్తి మద్దతు పలుకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెట్ మ్యచ్లు ఓడిపోయినప్పుడు క్రికెటర్ల దిష్టిబొమ్మలు తగలబెట్టడం.. ప్రజల ఆగ్రహావేశాలను వెళ్లగక్కేందుకు అలా చేసినట్టు వార్తా సంస్థలు పేర్కొనడం మామూలే. అయితే వాస్తవానికి టీమిండియా తరపున భావోద్వేగంతో నిలబడుతూ డబ్బులు పోగొట్టుకున్న వారే దిష్టిబొమ్మ దహనాల దగ్గర ఎక్కువగా కనబడతారన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కూడా కొందరి కోపానికి ఇలాంటి వ్యవహారమే కారణమని చెబుతున్నారు. దేశంలోని నల్లడబ్బు మొత్తానికి రాజకీయంగా కొన్ని లెక్కలున్నాయి. ఎన్నికల్లో జనాలకు డబ్బులు పంచి పబ్బం గడుపుకునేందుకు కొన్ని పార్టీలు లెక్కల్లో చూపని డబ్బును విరాళాల రూపంలో భారీగా స్వీకరిస్తాయి. మరి ఇతర పార్టీలకంటే బీజేపీకే ఎందుకు తక్కువ బ్లాక్మనీ అవసరమవుతోంది.. అన్ని పార్టీలు పెద్ద నోట్ల రద్దుపై చేస్తున్న గొడవ బీజేపీలో ఎందుకు లేదు అన్నది వేరే ప్రశ్న. మరోవైపు నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వారిలో పట్టణాల్లోని కొన్ని వర్గాలు కూడా ఉన్నాయి. దేశ ప్రయోజనాల కంటే తమ అవసరాలకు తగ్గట్టు లెక్కల్లో చూపని ధనాన్ని విరివిగా వాడుకునేందుకు అవకాశం లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. అయితే ఇప్పటికే మోదీ పెద్ద నోట్ల రద్దు, నల్లధనం కట్టడి విషయంలో ప్రజల నుంచి సానుకూల మద్దతు పొందినందున వీరి గొంతు కొంతవరకే పరిమితమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
No comments:
Post a Comment