బ్లాక్మనీ ఇలా కూడా ఉంది: కేంద్రానికి కోదండరాం కీలక సూచన
Subscribe to Oneindia Telugu
వికారాబాద్: తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కేంద్రానికి కీలక సూచన చేశారు. నోట్ల రూపంలో ఉన్న నల్లధనంతోపాటు.. భూములు, బంగారం రూపంలో ఉన్న నల్లధనంపై కేంద్రం దృష్టి సారించాలని కోదండరాం కోరారు. నోట్ల రద్దు విషయంపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర నెలరోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన బహిరంగ సభలో కోదండరాం ప్రసంగించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు భాగాలుగా విభజించి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఒక భాగాన్ని జూరాల నుంచి, మరోదాన్ని శ్రీశైలం నుంచి వచ్చే నీటి ద్వారా చేపట్టాలని సూచించారు. 'ఈ పథకాన్ని కేవలం శ్రీశైలం నుంచి వచ్చే నీటితోనే నిర్వహిస్తామంటున్నారు. ఆ నీరు వస్తుందో రాదో తెలియదు. రెండు భాగాలుగా విభజిస్తే కొంత మేలు జరుగుతుంది' అని కోదండరాం అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాల్సిన అవసరముందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేరళ ప్రభుత్వం విద్యాభివృద్ధికి బడ్జెట్లో 35 శాతం నిధులు కేటాయిస్తుంటే.. తెలంగాణలో 8 శాతమే కేటాయిస్తోందని అన్నారు.
త్వరలో జేఏసీ దినపత్రిక, వైబ్సైట్
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేసేందుకు జేఏసీ తరపున పత్రిక, వెబ్సైట్ ప్రారంభించనున్నట్లు రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వెల్లడించారు. వైబ్సైట్ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. జేఏసీ బలోపేతానికి జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రజా సంఘాలతో కలిసి జేఏసీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment