హైదరాబాద్లో పోలియో వైరస్!
14-06-2016 01:24:27

హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): దేశంలో పోలియో వైరస్ ఇంకా ఉందా? అదీ హైదరాబాద్లోనా?. అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో). హైదరాబాద్ నగర మురికినీటిలో పోలియో వైరస్ ఉన్నట్లుగా గుర్తించింది. వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో ప్రభుత్వం పరిస్థితిని అత్యవసరంగా సమీక్షిస్తోంది. దేశంలో పోలియో వైర్సను పూర్తిగా నిర్మూలించినట్లు మూడేళ్ల క్రితమే ప్రకటించినా..నివారణలో భాగంగా ప్రతి ఏటా రెండుసార్లు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఇటీవలే చుక్కల స్థానంలో కొత్త టీకాను కనిపెట్టారు. ఈ ఏడాది నుంచి కొత్త టీకాను పిల్లలకు వేయాలని నిర్ణయించారు. ఇంత జరుగుతున్నా పోలియో వైరస్ ఇంకా ఉన్నట్లు తాజా పరీక్షల్లో తేలింది. సాధారణంగా పలు పరీక్షలు నిర్వహించడానికి మురికినీటిని (మనిషి మలం, మూత్రం కలిసిన నీరు) ఎప్పటికప్పుడు ల్యాబ్లకు పంపిస్తారు. ఈ మురికినీటిలో ఉన్న వివిధ మూలకాలను పరీక్షించి.. మనిషిలోని రోగాలు, ఇతర లక్షణాలను అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే హైదరాబాద్లోని మురికి నీటిని ముంబైలోని డబ్ల్యూహెచవో పరీక్ష ల్యాబ్కు పంపించారు. అక్కడ ఆ నీటిని పరీక్షించగా.. అందులో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. దాంతో డబ్ల్యూహెచవో వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. సమాచారం అందుకు న్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పోలియో వైరస్ ఉన్నట్లు తేలినందున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాగా ఈ మురికి నీటిని ఏ సమయంలో, ఏ ప్రాంతం నుంచి సేకరించారనే సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దీనిపై మరింత లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఆ ప్రాంతంలో నివసించే మనుషుల వివరాలను సేకరించనున్నారు. వారందరికీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది.
No comments:
Post a Comment