చంద్రబాబు ఆ భ్రమలో ఉన్నారా!
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష ఉదంతంలో ఎపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కొంత విడ్డూరంగాను, మరికొంత విచిత్రంగాను ఉంది.ఈ విషయంలో మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది.ఒక వైపు తునిలో రైలు దగ్దం అవుతుంటే,దానిని అదుపు చేయవలసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లో విఫలం అయింది.పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తుంటే వారిని కంట్రోల్ చేయలేకపోయారు. నిజానికి ప్రభుత్వానికి సంబందించి ఇది పెద్ద వైఫల్యంగా పరిగణించాలి.దానిని కప్పిపుచ్చుకోవడానికా అన్నట్లు ఆ రోజు రాత్రే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా ప్రతిపక్ష నేత జగన్ కుట్రగా తేల్చేశారు.ఒక వేళ అది నిజమే అనుకుంటే ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ యంత్రాంగం అంతా నిద్రపోతోందని ఆయన ఒప్పుకుంటున్నారనుకోవాలి.ఘటన జరిగిన తర్వాత చేయవలసింది దోషులు ఎవరైనా వదలబోమని చెప్పాలి.అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతో జగన్ పై ఆరోపణ చేసినట్లు కనబడుతుంది.జగన్ ప్రతి సవాల్ చేస్తే దానికి సమాధానం ఇవ్వలేదు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. ఉభయ గోదావరి జిల్లాలలో అసలు ఇలాంటి ఘటనలే జరగవని, ఇదంతా రాయలసీమ నుంచి ,కడప నుంచి వచ్చినవారి పని అని కూడా చంద్రబాబు చెప్పేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా చెప్పవవ్చా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.శాంతి భద్రతలను రాజకీయ కోణంలో చూడరాదన్న ప్రాధమిక సూత్రాన్ని చంద్రబాబు విస్మరించారు.తుని రైలు అగ్గిలో కూడా ఆయన రాజకీయాన్ని చూడడానికే ఉబలాటపడడం దురదృష్టకరం.ఆ తర్వాత ముద్రగడ రిజర్వేషన్ డిమాండ్ పై దీక్ష చేస్తుంటే టిడిపి నేతలను పంపించి తుని కేసులు ఉండబోవని హామీ ఇచ్చారని ముద్రగడ చెబుతున్నారు.చంద్రబాబు ఇప్పుడు అబద్దాలు ఆడుతున్నారని, అన్యాయంగా తమవాళ్లపై కేసులు పెట్టారని ఆయన అంటున్నారు.అది నిజమా?కాదా? తాను అబద్దం ఆడలేదని ఇంతవరకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం లేదు.తదుపరి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొందరిని తుని రైలు ద్వంసం కేసులో అరెస్టు చేశారు.దానిపై ముద్రగడ మళ్లీ దీక్షకు దిగారు.ముద్రగడను ఎలాగైనా కట్టడి చేయాలన్న లక్యంతో మీడియాతో సహా అందరిని నియంత్రించి ,ఆయనను ఆస్పత్రికి తరలించి అక్కడ ఎవరిని కలవనివ్వకుండా ఉంచడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇంత సీనియర్ నేత అయిన చంద్రబాబు చేయాల్సిన పనేనా ఇది అన్న బావన కలుగుతుంది.అదే సమయంలో ముద్రగడ అడిగితే సిబిఐ విచారణను కోరతామని ప్రభుత్వం చెప్పడం కూడా విశేషమే. అరవైఎనిమిది కేసులు నమోదైన వ్యక్తిని ఏ విచారణ కావాలో కోరుకో అని ప్రభుత్వాలు అడుగుతాయన్న సంగతి కూడా చిత్రంగానే ఉంటుంది. శాంతిభద్రతలు ముఖ్యమే.కాని ఆ పేరుతో ప్రభుత్వాలు పోలీసు వ్యవవస్థను అడ్డం పెట్టుకుని అరాచకం చేయాలని అనుకుంటే అది సాధ్యం కాని పని అని ప్రభుత్వనేతలు అర్దం చేసుకోవాలి.తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చేశామో, అదికారంలోకి వచ్చాక ఏమి చేస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి తప్పులు చేయరు.అధికారంలోకి వచ్చినవారు కొందరు తాము శాశ్వతంగా ఉంటామని భ్రమిస్తుంటారు.బహుశా చంద్రబాబు కూడా అలాంటి భ్రమలలో ఉంటున్నారనుకోవాలి.
No comments:
Post a Comment