రజనీకాంత్ ఇంట్రొడక్షన్ సీనులో, వై. బి సత్యనారాయణ గారు రాసిన "మా నాయన బాలయ్య" పుస్తకం ఇంగ్లీషు వర్షను చదువుతున్నట్టు చూపిస్తారు. ఒక రెణ్ణిముషాల తర్వాత, స్వేచ్చగా ఎగరాల్సిన పక్షులని పంజరాల్లో బంధించారే అని బాధపడుతూ రజనీ కాంత్ డైలాగు, "చిన్న పంజరం, బయట అనంతమయిన ఆకాశం, ఆ పక్షి పడే క్షోభ నాకు తెలుసు". దానికి అతని స్నేహితుడు, "పంజరం అయితేనేమి, క్షేమంగా ఉన్నాయి. బయటకొదిలితే ఇతర పక్షులు వాటిని పొడిచి చంపేస్తాయి" లాంటిదేదో అంటాడు. దానికి హీరో, "ఎగరడం పక్షి గుణం. వాటిని స్వేచ్చగా వొదిలేస్తే చావో బతుకో అవి తేల్చుకుంటాయి" అంటాడు.
ఒక పావుగంట తర్వాత, ఆ తెల్ల చైనా వాళ్ళకంటే మేమెందుకు తక్కువా అంటూ హీరో పోరాటం చేసి గెలవడం, ధైర్యవంతురాలయిన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతని భార్య అతన్ని ప్రోత్సహించడం, గాంధీ పంచె, అంబేద్కర్ సూటు వెనక రాజకీయం ఉంది తెలుసుకో అనే డైలాగు, ఇవి, ఈ సినిమాలో ఏదో కథున్నట్టుందిరోయ్ అని నా అమాయక ప్రేక్షక బుర్రని కాసేపు ఆశపడేట్టు చేసాయి.అబ్బే కంగారు పడకండి, అదంతా నా భ్రమేనని ఒక రెండు గంటల తర్వాత తేలిందిలేండి. రాధికా ఆప్టే కనపడిన ఆ కొంత సేపు తప్పించి, మిగిలిన సినిమా అంతా ఢాం ఢాం డిష్యుం డిష్యుమే!
ఈ సినిమాలో నాకస్సలు అర్థం కాని కొన్ని విషయాలు : వంద కోట్లు పెట్టి తీసామన్నారు, అంటే 99 కోట్లు హీరోకే ఇచ్చారా? సినిమా అంత నాసిరకంగా ఉందేమి? ఇంతకీ ఆ సినిమాలో ఎవరో ఒక పెద్ద మనిషి ఊహించని విధంగా తళుక్కున మెరిసి కాసేపు కనపడతారని అన్నారు? యార్ అతు? సినిమా ముగింపుకి అర్థమేమి డా?
బాగా అర్థం అయిన కొన్ని విషయాలు: కబాలయినా, బాహుబలయినా ఆ దొరా ఈ దొరా కొట్టుకు చావడమే గాని మనబోటి గాళ్ళకొరిగేదేమీ లేదు. ఎంతవారు గానీ, తమిళులైన గానీ వ్యక్తి పూజ వలన ఫూలులౌదురోయ్ అని!
No comments:
Post a Comment