వారిది వేద వాక్కు
ధనవంతుడైన పి.యస్. శివస్వామి అయ్యర్ చెన్నైలో ప్రముఖ న్యాయవాది. మంచి పేరు ప్రఖ్యాతులు గడించినవారు. అతని భార్య పేరు కళ్యాణి. వారి ఇంటి పేరు ‘సుధామ’. అప్పట్లోనే అది చాలా పెద్ద భవనం. ఒకసారి మహాస్వామి వారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒకరోజు స్వామి వారు ‘సుధామ’కు వచ్చి శివస్వామి దంపతులను ఆశ్చర్యానందాలకు గురిచేసారు.
ఆ దంపతులకు పిల్లలు లేరు.
పరమాచార్య స్వామివారు ఆ విషయం విని, “మీకు స్వంత పిల్లలు లేకపోతేనేమిటి? ఎంతోమంది పేదపిల్లలకు తల్లితండ్రులు అవ్వండి. నీ న్యాయవాద వృత్తిలో ధర్మమార్గంలో బ్రతుకుతూ న్యాయార్జితమైన నీ సంపాదనతో విద్యాశాలలను స్థాపించి జ్ఞానదానం చెయ్యి. నీ పేరు ఎప్పటికి నిలిచిపోతుంది. అలాగే, నీ ధర్మపత్ని పేరుమీద ఎందరో పిల్లలకు జన్మనిచ్చేదిగా ఒక ప్రసూతి ఆసుపత్రి కట్టించి నీ భార్య పేరు పేరు కూడా స్థిరపడేట్టు చెయ్యి” అని సెలవిచ్చారు.
పరమాచార్య స్వామివారి ఆజ్ఞని శివస్వామి అయ్యర్ శిరసావహించారు. వారి భవ్యమైన భవనం ‘సుధామ’ను అమ్మేసి సుల్లివన్ గార్డేన్ రోడ్డ్డులో ఒక చిన్న ఇంటిని కొనుక్కుని అందులోకి మారారు.
ఎడ్వర్డ్ ఎల్లియొట్స్ రోడ్డు(ఇప్పడు డా. రాధాకృష్ణన్ సలై) లోని ప్రెసిడెంట్ హోటలు దగ్గర కళ్యాణి ఆసుపత్రిని ప్రారంభించి ఉచితంగా ప్రసూతి వైద్యకేంద్రాన్ని ప్రారంభించారు. ఈనాటికి ఆ మహత్కార్యం అవిశ్రాంతంగా జరుగుతోందంటే అది మహాస్వామి వారి అనుగ్రహం వారి కృపాకటాక్షం వల్ల మాత్రమే.
అతని స్వంత సంపాదన ఖర్చుపెట్టి కపాలీశ్వర దేవస్థానం తూర్పు మాడ వీధి పక్కన ఉన్న సుందరేశ్వరర్ వీధిలోని రసిక రంజన సభ ఎదురుగా ఉన్న జైపూర్ మహారాజు ఆద్వర్యంలో నడుస్తున్న బాలికల పాఠశాలను కొనుక్కుని దాన్ని ‘లేడి శివస్వామి అయ్యర్ బాలికల ఉన్నత పాఠశాల’గా నామకరణం చేసి అభివృద్ధి పరచారు.
పరమాచార్య స్వామి వారి వాక్కు వేద వాక్కు.
--- వి. శ్రీనివాసన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2
No comments:
Post a Comment