పదిరోజులు ఉండగలవా?
కంచి పరమాచార్య స్వామివారు హంపిలో మకాం చేస్తున్నారని తెలుసుకుని నేను నా భార్యతో పాటు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. ఉదయం పది గంటలప్పుడు స్వామివారిని దర్శించుకున్నాము. అప్పుడు వారు నన్ను, “ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు?” అని అడీగారు.
”మూడు రోజులు పెరియవ” అన్నాన్నేను.
స్వామివారు కొద్దిసేపు అలోచించి, “నాతోపాటు పదిరోజులు ఇక్కడ ఉండగలవా?” అని అడిగారు.
నేను కొంచం సంకోచంతో, “మూడు రోజుల సెలవుపై ఇక్కడకు వచ్చాను. ఎక్కువ రోజులు అంటే ఆఫీసు వారు ఒప్పుకోరు” అని బదులిచ్చాను.
మహాస్వామివారు, ”సరే మూడు రోజులు ఉండు” అని చెప్పారు.
సాయిత్రం నాలుగ్గంటలప్పుడు స్వామివారు నన్ను పిలిచి, “ఉదయం నేను పదిరోజులు ఉండగలవా అని అడిగితే కుదరదు అన్నావు కదా. కాని నువ్వు ఇప్పుడు ఈ రాత్రికే హైదరాబాదు వెళ్ళిపో” అని అన్నారు.
స్వామివారు ఇలా అనడం నన్ను కొద్దిగా కలచివేసింది. ఎందుకు ఈ రాత్రికే వెళ్ళమంటున్నారు. నావల్ల ఏమన్నా అపరాధమా? లేక ఇంట్లోవాళ్ళకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? అని అలోచించడం మొదలుపెట్టాను. వారి మాటను శిరసావహించి స్వామివారి సెలవు తీసుకుని ఇద్దరము బయలుదేరాము.
రైల్వేస్టేషనుకు వచ్చి అంతకుముందు 3 రోజుల తరువాత హంపి నుండి హైదరాబాదు ప్రయాణానికి బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేయించుకుని ఇప్పుడు ప్రయాణం ఎలా అని ఇద్దరము ఆలోచిస్తున్నాము. ఇద్దరము మాట్లాడుకుని జనరల్ బోగి ఎక్కుదామని నిర్ణయించుకున్నాము. మా మాటలను విన్న స్టేషను మాస్టారు అంతకుముందే రెండు బెర్తులు ఖాళీ అయ్యాయని చెప్పారు.
మీకు కావాలంటే ఆ ఖాళీ బెర్తులను మీకు కేటాయిస్తాను అని చెప్పారు. ఎంతటి అనుగ్రహం నాపైన స్వామివారికి. మాకోసం రెండు బెర్తులు కూడా ఏర్పాటు చేసారు. మనసులోనే స్వామికి నమస్కరించి రైలెక్కాము.
మరునాడు ఉదయం రైలు హైదరాబాదు శివారుకు చేరుకుంటుండగా, చాలామంది ప్రజలు మా ట్రైన్ పై రాళ్ళు వేస్తూ గట్టిగా నినాదాలు చేస్తూ కనపడ్డారు. వెంటనే రైలు తలుపులు, కిటికీలు మూయవలసిందిగా అందరికి టికెట్ కలెక్టరు చెప్పారు. మేము కాచిగూడ స్టేషను చేరుకునేవరకు దాదాపు 45 నిముషాలపాటు రైలుకు రాళ్ళదెబ్బలు తగులుతునే ఉన్నాయి.
మేము రైలుదిగగానే ఏమిటి విషయం అని ఆరాతీయగా, ఢిల్లీలోని జనతా ప్రభుత్వం నిన్న రాత్రి 7 గంటలప్పుడు ఇందిరా గాంధి గారిని అరెస్టు చేసారని చెప్పారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కాంగ్రెసు ప్రభుత్వం కావున వాళ్ళు ధర్నాలకు దిగారు.
ఇందిరా గాంధిగారు అరెస్ట్ అయినది రాత్రి ఏడుగంటలకి. కాని స్వామి మమ్మల్ని వెళ్ళమన్నది నాలుగు గంటలకే. మీరు నమ్మండి తరువత తొమ్మిది రోజులదాకా రైళ్ళ రాకపోకలు లేవు. అంటే పది రోజులపాటు రైళ్ళు ఉండవని స్వామివారికి నిన్న ఉదయమే తెలుసు. అందుకే నన్ను పది రోజులు ఉండగలవా అని అడిగారు.
నా తల్లి, నా దైవం నన్ను ఎలా రక్షించిందో అని ఇప్పుడు తలచుకుంటే వారి కరుణకు శరీరం పులకిస్తుంది.
--- గణేశన్ మామ, హైదరాబాద్. ‘ది హిందు’ రిపోర్టర్.
No comments:
Post a Comment