|
మహామహుల ఉపన్యాసాలతో అలరారిన మన చట్టసభలు ఇప్పుడు బూతులకు వేదిక అవ్వడం బాధాకరమే! వాదనా పటిమతో పైచేయి సాధించాలన్న ఆలోచన స్థానంలో మందబలంతో అణచివేతలు మొదలయ్యాయి. అధికారపక్షమే కాదు- ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని లోపాలు ఎత్తిచూపి ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలు దువ్వుతోంది. సభాపతులు నిస్సహాయం గా మారడంతో సభా వ్యవహారాలు తరచుగా అదుపు తప్పుతున్నాయి.అధికారంలో ఉన్నాం కనుక ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అధికారపక్షం, ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రభుత్వం ఏమి చేసినా తప్పుపట్టాలన్న భావన ప్రతిపక్షంలో ఉంటున్నందునే పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రభుత్వం చేసే మంచి పనులను గతంలో ప్రతిపక్ష సభ్యులు కూడా మెచ్చుకునేవారు. అదే విధంగా ప్రభుత్వపరంగా జరిగే తప్పులను అధికారపక్ష సభ్యులు సైతం వేలెత్తి చూపేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి మచ్చుకు కూడా కనిపించదు.
కేరళ అసెంబ్లీలో అధికార, విపక్షాల సభ్యులు కొట్టుకున్న దృశ్యాలను శుక్రవారంనాడు మనమందరం కళ్లారా వీక్షించాం. ఇటీవలి కాలంలో మన దేశంలోని చట్టసభల్లో ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం అయిపోయాయి. ఆ మాటకొస్తే మన దేశంలోనే కాదు- సూట్లు ధరించి దర్జా ఒలకబోసే విదేశాల్లోని తెల్లవారు సైతం చట్టసభల్లో రక్తం కారేలా కొట్టుకుంటున్నారు. చట్టసభలు రణరంగాలను తలపించడం కామన్ అయిపోయింది. చట్టాలు చేయాలని కోరుతూ మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరించడం ఇప్పుడు వినోదాత్మక వ్యవహారంగా మారిపోయింది. మొత్తంగా సమాజంలోనే విలువలు క్షీణించాయి కనుక దాని ప్రభావం ప్రజాప్రతినిధులపైన కూడా పడుతోంది. చట్టసభలలో అర్థవంతంగా చర్చలు జరిపితే టీవీలలో చూస్తున్నవారు కూడా బోర్ ఫీలవుతున్నారు. ప్రజలు కూడా మరోలా కోరుకుంటున్నారేమో! ప్రజలు కోరుకుంటున్నారు కనుక మేము చూపిస్తున్నామని మీడియా సమర్థించుకుంటోంది. ఈ ప్రభావం తెలుగు రాష్ర్టాల చట్టసభలపైన కూడా పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ, ఏపీ శాసనసభల బడ్జెట్ సమావేశాలలో వాగ్యుద్ధాలు పరిపాటి అయ్యాయి. సహచర శాసనసభ్యులను గౌరవ సభ్యుడు అని సంబోధించే వారే కొంతసేపటికి కుక్కలు, నక్కలు అని తిడుతున్నారు. శాసనసభలకు, సభ్యులకు ప్రత్యేకంగా హక్కులను కల్పించుకున్నారు. వారిని కించపరిచినా, అవమానపరిచినా సభా హక్కుల ఉల్లంఘన కింద నేరంగా పరిగణిస్తారు. మూడు దశాబ్దాల క్రితం శాసనసభలో మనవాళ్లు హుందాగా వ్యవహరించేవారు. కేవలం వాక్చాతుర్యంతో అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టేవారు. 1980కి పూర్వం చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలిలో రోశయ్య ప్రతిపక్షంలో ఉండేవారు. ఆయన తన వాక్చాతుర్యంతో చెన్నారెడ్డిని నిత్యం ఇరుకునపెడుతుండేవారు. రోశయ్య చమత్కారానికి ఒక ఉదాహరణ చెప్పుకొందాం! ఒక రోజు అవినీతిపై మాట్లాడుతూ, ‘‘ అధ్యక్షా! నేను ఈ మధ్య చార్మినార్ నుంచి వస్తున్నాను. ఉస్మానియా ఆసుపత్రి వద్దకు వచ్చేసరికి అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. నేను కారు దిగి ఏమి జరిగిందా అని ఆరా తీయగా, ప్రసవం కోసం వచ్చిన మహిళ ఆసుపత్రిలో పురిటి నొప్పులు పడుతోంది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బిడ్డ బయటకు రావడం లేదు. నేను గర్భం నుంచి బయటకు రావాలంటే లంచం కావాలని ఆ బిడ్డ డిమాండ్ చేస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో పుడుతున్న బిడ్డలు కూడా లంచానికి అలవాటుపడుతున్నారు’’ అని రోశయ్య విమర్శించారు. ఈ విమర్శలో అతిశయోక్తి ఉంది కానీ, అశ్లీలత, అపస్వరం లేవు. అందుకే రోశయ్య ఉపన్యాసం పూర్తికాగానే ప్రతిపక్ష సభ్యులే కాకుండా అధికారపక్ష సభ్యులు కూడా ఆయన చమత్కారానికి నవ్వుకున్నారు. పిట్ట కథలు, కట్టుకథలతో తనను రోజూ ఇబ్బంది పెడుతున్న రోశయ్యను కొంత కాలానికి చెన్నారెడ్డి తన బుట్టలో వేసుకున్నారు. ఆనాటి ఆ పార్టీ ఫిరాయింపు తెలుగునాట పెద్ద చర్చనీయాంశమైంది. అది వేరే విషయం. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, గౌతు లచ్చన్న వంటి హేమాహేమీలు తమ వాగ్ధాటితో అధికారపక్షానికి ముచ్చెమటలు పట్టించేవారు. ఇప్పటిలా ‘నీయవ్వ, నోర్మూసుకో, చూసుకుందామా?, కడిగేస్తాను’ వంటి పద ప్రయోగాలు వినపడేవి కావు. అంత వరకు ఎందుకు! శాసనసభా వ్యవహారాలను రిపోర్ట్ చేయడం జర్నలిస్టులకు కూడా కత్తి మీద సాములా ఉండేది. సభలో గొడవ చేశారు అని రాయాలంటే భయపడాల్సి వచ్చేది. గొడవ అన్న పదం అన్పార్లమెంటరీ అవుతుందనీ, సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని భయపడేవాళ్లం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో శాసనమండలిలో జరిగిన చర్చకు పెద్దల సభలో గలాభా అని ఈనాడు పత్రికలో ఒక శీర్షిక పెట్టారు. పెద్దలు అన్న పదాన్ని కోట్స్లో పెట్టారు. అలా చేయడం తమను అవమానించడమేననీ, సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని శాసనమండలి సభ్యులు భావించడం, రామోజీరావుకు నోటీసు వెళ్లడం కూడా జరిగింది. సదరు నోటీసుకు రామోజీరావు స్పందించకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసి సభకు తీసుకురావలసిందిగా నగర పోలీసు కమిషనర్ను ఆదేశిస్తూ శాసనమండలి నిర్ణయం తీసుకుంది. దీనిపై రామోజీరావు సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. చివరకు ఈ వ్యవహారం రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణకు దారితీసింది. చివరకు మధ్యేమార్గంగా సమస్య పరిష్కారమైంది. ఇంత జరగడానికి కారణం ఏమిటంటే అప్పటి అధికారపక్షమైన తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో మెజారిటీ లేకపోవడమే! ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరగడంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్.టి.రామారావు శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు రద్దు అయిన శాసనమండలి రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పునరుజ్జీవనం పొందింది. పదాల విషయంలో అంత పట్టింపుగా ఉండే సభ్యులను చూసిన మనమే, ఇప్పుడిలా తమను తాము కోతులుగా అభివర్ణించుకుంటున్న సభ్యులను చూస్తున్నాం.
- సిసలైన సభాపతులు!
గతంలో చట్టసభల నిర్వహణకు ఇప్పటి సభల నిర్వహణకు పోలికే లేదు. ఎంతో మంది ఉద్ధండులు సభాపతి స్థానాన్ని అలంకరించి ఆ స్థానానికి వన్నె తెచ్చారు. అయ్యదేవర కాళేశ్వరరావు వంటివారు అలంకరించిన సభాపతి స్థానం ఇప్పుడు అధికార పార్టీ కనుసన్నలలో మెలిగే పరిస్థితికి దిగజారింది. గతంలో సభాపతులుగా పనిచేసిన వారు ముఖ్యమంత్రులకు వంగి వంగి సలాం చేసేవారు కాదు. ముఖ్యమంత్రుల ఇళ్లకు కూడా వెళ్లేవారు కాదు. పార్టీ తరఫున ఎన్నికైనా సభాపతి కాగానే స్వతంత్రంగా వ్యవహరించేవారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాని సందర్భాలలో కల్పించుకుని మంత్రులను మందలించేవారు. సభాపతి అనుమతి ఇవ్వకపోతే ముఖ్యమంత్రికి కూడా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన అంశాలపై విచారణకు ఆదేశించడానికి మంత్రులు నిరాకరించిన సందర్భాలలో సభాపతులే చొరవ తీసుకుని విచారణకు ఆదేశించేవారు. కోన ప్రభాకరరావు సభాపతిగా ఉన్నప్పుడు మంత్రులను తరచూ మందలించేవారు. పలు అంశాలపై ఆయనే చొరవ తీసుకుని విచారణకు ఆదేశించేవారు. అప్పట్లో ముఖ్యమంత్రులు కూడా ఎదురు చెప్పేవారు కాదు. 1985లో తెలుగుదేశం పార్టీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత జి.నారాయణరావును సభాపతిగా ఎన్నుకున్నారు. ఆయన కూడా స్వతంత్రంగా వ్యవహరించేవారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను కూడా ఖాతరు చేసేవారు కాదు. మంత్రులను గడగడలాడించేవారు. ఆ తర్వాత సభాపతులుగా పనిచేసిన వారిలో కొంతమంది ముఖ్యంగా శ్రీపాదరావు, పి.రామచంద్రారెడ్డి వంటివారు ఆ స్థానానికి హుందాతనం తెచ్చే విధంగానే వ్యవహరించారు. 1990 తర్వాత నుంచి పరిస్థితిలో క్రమంగా మార్పు వచ్చింది. సభాపతులు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండటం లేదు. అధికార పార్టీ అభిమతానికి అనుగుణంగా వ్యవహరించడం మొదలైంది. శాసనసభ్యులు ఇచ్చిన రాజీనామాలను కూడా ఆమోదించలేని నిస్సహాయ స్థితిలోకి సభాపతులు నెట్టబడ్డారు. గతంలో ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఉండేదో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే గౌరవం ఉండేది. రానురాను పరిస్థితి మారిపోతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, రాజశేఖర్రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికి రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. వీరిద్దరి మధ్య వ్యక్తిగత స్థాయిలో వైరం ఉందా? అన్నట్టుగా సభ నడిచేది. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటానికి మైకు లభించేది కాదు. ఇప్పుడు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని రోజూ వాపోతుంటారు. సంప్రదాయాలను మనం గౌరవిస్తే అవే మనల్ని కాపాడతాయి. మహామహుల ఉపన్యాసాలతో అలరారిన మన చట్టసభలు ఇప్పుడు బూతులకు వేదిక అవ్వడం బాధాకరమే! వాదనా పటిమతో పైచేయి సాధించాలన్న ఆలోచన స్థానంలో మందబలంతో అణచివేతలు మొదలయ్యాయి. అధికారపక్షమే కాదు- ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని లోపాలు ఎత్తిచూపి ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కాలు దువ్వుతోంది. సభాపతులు నిస్సహాయంగా మారడంతో సభా వ్యవహారాలు తరచుగా అదుపు తప్పుతున్నాయి. అధికారంలో ఉన్నాం కనుక ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని అధికారపక్షం, ప్రతిపక్షంలో ఉన్నాం కనుక ప్రభుత్వం ఏమి చేసినా తప్పుపట్టాలన్న భావన ప్రతిపక్షంలో ఉంటున్నందునే పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రభుత్వం చేసే మంచి పనులను గతంలో ప్రతిపక్ష సభ్యులు కూడా మెచ్చుకునేవారు. అదే విధంగా ప్రభుత్వపరంగా జరిగే తప్పులను అధికారపక్ష సభ్యులు సైతం వేలెత్తి చూపేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి మచ్చుకు కూడా కనిపించదు. అధికార పక్షాన్ని మెచ్చుకుంటే పార్టీ ఫిరాయిస్తున్నారని అనుమానించే పరిస్థితి! ఇక అధికారపక్ష సభ్యులకు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమే ఉండటం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ర్టానికి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. దీంతో ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తేవారే కనిపిస్తున్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాలలోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. కనుక అధికారపక్ష సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొంతవరకైనా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నానని అనిపించుకొనే ప్రయత్నిస్తున్నారు. అయితే జాతి వైరంలా నరసరావుపేటలో దశాబ్దాలుగా ఉన్న వర్గ వైషమ్యాల కారణంగా కోడెలను పెద్దమనిషిగా చూడటానికి ప్రతిపక్షమైన వైసీపీ ఇష్టపడుతున్నట్టు కనిపించడం లేదు. ఫలితంగా స్పీకర్కు, ప్రతిపక్ష నాయకుడికి మధ్య తరచూ వాగ్యుద్ధం జరుగుతోంది. సిద్ధాంతాల ప్రాతిపదికపై రాజకీయ విభేదాలు ఉండాల్సిన చోట వ్యక్తిగత విభేదాలు, వైషమ్యాలు చోటుచేసుకోవడం వల్ల అధికార, ప్రతిపక్షాల మధ్య సామరస్య వాతావరణమే కనిపించడం లేదు. ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒక నాయకుడిగా గుర్తించడానికి అధికారపక్షమైన తెలుగుదేశం సభ్యులు ఇష్టపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి హావభావాలు కూడా అధికారపక్షాన్ని రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ప్రజలు తమను గొప్ప నాయకులుగా, రాజనీతిజ్ఞులుగా గుర్తించాలని ఎవరూ కోరుకోవడం లేదు. తమ వర్గం ప్రజలతో పాటు, తమను గుడ్డిగా అభిమానిస్తున్నవారి మెప్పు పొందడమే లక్ష్యంగా నేటి తరం నాయకులు వ్యవహరిస్తున్నారు. ‘మా వాడు శాసనసభలో ఇవ్వాళ ఇరగదీశాడు’ అని చప్పట్లు కొట్టించుకోవాలన్న ఆతృతే తప్ప విశాల ప్రయోజనాలు ఎవరికీ అక్కర్లేదు. ఫలితంగా సిద్ధాంత రాద్ధాంతాలు మరుగునపడి గందరగోళాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు కూడా వర్గాలుగా విడిపోయినందున తమవాళ్లు చేసేది తప్పుగా వారికి అనిపించడం లేదు.
- రాజధర్మం ఇదేనా?
ఏపీ శాసనసభ విషయం అలా ఉంచితే తెలంగాణ శాసనసభలో కూడా పరిస్థితి ఏకపక్షంగానే ఉంటోంది. అయితే ఏపీ సభలో వలె కాకుండా తెలంగాణ శానసనభలో ముఖ్యమంత్రి కేసీఆర్కు, ప్రతిపక్ష నాయకుడు కె.జానారెడ్డికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జానారెడ్డిని మంచి చేసుకుంటే చాలు అన్నట్టుగా ఆయన జానారెడ్డి సూచనలపై ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారు. వర్తమాన రాజకీయాలలో ఈ ధోరణి వింతగానే ఉంటోంది. అందుకే కాబోలు కేసీఆర్- జానారెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ప్రచారం సాగుతోంది. జానారెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ అయిన కాంగ్రెస్లోనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వంతో పోరాడవలసిన ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న తాము మెతక వైఖరి అవలంబించడం ఏమిటని కాంగ్రెస్ సభ్యులు విసుక్కుంటున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా తనది ప్రత్యేక శైలి అని జానారెడ్డి సమర్థించుకుంటున్నారు. జానారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ప్రతిపక్ష నాయకుడిగా వేరొకరిని నియమించాలన్న ఒత్తిళ్లు పెరిగాయి. జానారెడ్డి స్థానంలో జీవన్రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తే అధికారపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కోవచ్చని పలువురు అధిష్ఠానానికి సూచించారు. మొత్తంమీద తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రస్తుతానికి ఎదురులేదు. తనకు కంట్లో నలుసుగా మారిన తెలుగుదేశం పార్టీ సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయించారు. గతంలో కూడా ఇలాగే ప్రతిపక్ష సభ్యులను దీర్ఘకాలంపాటు సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మిగతా ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు రెండు మూడు రోజుల తర్వాత అధికారపక్షం సస్పెన్షన్లను ఎత్తివేసేది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం సభ్యులపై సస్పెన్షన్లను ఎత్తివేయమని అడిగేవారు కూడా కనిపించడం లేదు. ఒకవేళ అడిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అంగీకరించకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ విషయంలో కక్షకట్టి ఉన్నారని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు తొలి రోజే వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు కనుక ఆయనకు అటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడవలసిన తెలుగుదేశం పార్టీ సభ్యులు తొలి రోజే అవకాశమిచ్చారు. తెలంగాణలో మరే ఇతర పార్టీకీ తావుండదని తరచుగా చెప్పే కేసీఆర్, తెలుగుదేశం పార్టీ ఉనికిని అసలుకే భరించలేకపోతున్నారు. అందుకే ఆ పార్టీపైకి ఒంటికాలిపై వెళుతున్నారు. నియంత లక్షణాలే కాకుండా రాజకీయ జాణతనం కూడా తెలిసిన కేసీఆర్ ముందు ఎలా వ్యవహరించాలో తెలుగుదేశం పార్టీ సభ్యులు తెలుసుకోవాలి. లేకపోతే ఇలాగే బూమరాంగ్ అవుతుంది. ప్రస్తుతానికి తెలంగాణలో ముఖ్యమంత్రి ఆడిందే ఆట, పాడిందే పాటగా చెల్లుబాటు అవుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రావాళ్ల పెత్తనం ఏమిటని కేసీఆర్తో పాటు పలువురు తెలంగాణవాదులు తరచుగా వ్యాఖ్యానిస్తుంటారు. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగినా పట్టించుకునేవాళ్లు లేరు. యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేసిన చినజీయర్ స్వామి ఆంధ్రావారు కాదా? ఆగమ శాస్ర్తాలు తెలిసినవాళ్లు తెలంగాణలో ఒక్కరు కూడా లేరా? ఆదికవి నన్నయ్య కాదు, పాల్కురికి సోమనాథుడు అని పాఠ్యాంశాలలో మార్పు చేయాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో పండితులు కనిపించడం లేదా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారులైన సుందర వరద భట్టాచార్యులది మహబూబ్నగర్ జిల్లా కొడంగల్. తెలంగాణకు చెందిన ఆ పండితుడు ఆగమ శాస్త్రంలో దిట్టగా దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన విద్వత్తును టీటీడీయే గుర్తించి గౌరవించినప్పుడు కేసీఆర్కు ఎందుకు గుర్తుకురాలేదు? వాస్తవానికి ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుగా నియమించడంపై అప్పట్లో వివాదం జరిగింది. విమర్శలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో అప్పుడు జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలోనూ సుందర వరదాచార్యులు ప్రథమ స్థానంలో నిలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రధానంగా ఆయన సలహా మేరకే జరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన సుందర వరద భట్టాచార్యులవంటి వారు ఉన్నప్పటికీ... కుల గురువు అనే పక్షపాతం వల్లనే ఆంధ్రా ప్రాంతానికి చెందిన చిన జీయర్ స్వామి తెలంగాణకు ఆప్తుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కనిపిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ కంచ ఐలయ్య రెండు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో తన వ్యాసంలో రాసినట్టుగా తెలంగాణను వైష్ణవాంధ్రప్రదేశ్గా మారుస్తారేమో తెలియదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాళ్లు రాజధర్మాన్ని పాటించాలి. తన-పర తేడాలు ఉండకూడదు. కేసీఆర్ వంటి వారిలో రాజధర్మం కోసం వెదకడం వృథా ప్రయాసే అవుతుంది. తన చర్యలను విమర్శించేవారిని, వ్యతిరేకించేవారిని ఆత్మరక్షణలోకి నెట్టడానికి ‘జై తెలంగాణ’ అన్న నినాదం ఇంకా ఆయన వద్ద ఉంది. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవం సందర్భంగా రెండు రోజుల క్రితం నిజామాబాద్లో జరిగిన సభలో బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందుతున్నాయా? అని కేసీఆర్ ప్రశ్నించగా, లేదు లేదని పలు చేతులు పైకి లేచాయి. దీంతో సభలో అలజడి రేగింది. ఇది గమనించిన కేసీఆర్ ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. ప్రజలు కూడా తమ సమస్యలను మరచిపోయి ‘జై తెలంగాణ’ అంటూ ప్రతిస్పందించారు. తెలంగాణలో ఈ పరిస్థితి మరికొంత కాలం సాగవచ్చు. పాలకులు ఎవరైనా అంతిమంగా ప్రజల మన్ననలను పొందవలసిందే! భావోద్వేగాలు కొంతకాలం పాటు మాత్రమే కాపాడతాయి. మరో రెండు నెలలు గడిస్తే ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుంది. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఏమి చేశావు అని ప్రశ్నించే నోళ్లు పెరుగుతాయి. శాసనసభలలో ప్రతిపక్షాలు సమర్థంగా వ్యవహరిస్తున్నాయా? గొడవకు దిగుతున్నాయా? అన్నది పూర్వపక్షం అవుతుంది. సభా వ్యవహారాల సరళిని బట్టి ఏ ఒక్క రాజకీయ పార్టీనీ ప్రజలు ఆదరించడమో తిరస్కరించడమో జరగదు. అలా అయితే మన ప్రజాప్రతినిధులు పలువురు మళ్లీ మళ్లీ గెలవరు. ప్రభుత్వం తమకు ఏమి చేస్తున్నది అన్నది మాత్రమే ప్రజలు గమనిస్తుంటారు. శాసనసభల్లో ఎవరిది పై చేయి అయితే మాకేమిటి? మా చేయి మాత్రం పైనే ఉంటుందని ప్రజలు అయిదేళ్లకోసారి గుర్తుచేస్తుంటారు. ఈ వాస్తవాన్ని గుర్తించి చట్టసభలను రణక్షేత్రాలుగా మార్చే చర్యలకు రాజకీయ పార్టీలు స్వస్తి చెబుతాయని ఆశిద్దాం!
|
No comments:
Post a Comment