బూడిద - విభూతి
అరవైమూడు మంది నాయనార్లలో నలుగురు నాల్వర్లుగా(అప్పర్, సుందరర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్) ప్రసిద్ధులు. అందులో ఒకరైన మాణిక్యవాచకర్ మూగపిల్ల అయిన సింహళ రాజు కుమార్తెకి చిదంబరం నటరాజస్వామి సాక్షిగా మాటలు తెప్పించారు. ఆయన నోటినుండి తిరువాచకం వినాలని థిల్లై నటరాజ స్వామి స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి మాణిక్యవాచకర్ చెప్తుంటే తాటి ఆకులపై రాసాడు.
మాణిక్యవాచకర్ బౌద్ధమతావలంబకుడైన ఆ రాజును చిట్టచివరిది నిర్వాణము, శూన్యత్వము కాదని ఒప్పించగలిగాడు. ఆయన దీన్ని విభూతి సాయంతో ప్రత్యక్షంగా నిరూపించి చూపించాడు. ఏదేని వస్తువు అగ్ని చేత దహింపబడినప్పుడు అది మాడిపోతుంది. ఆ మిగిలిన నల్లని పదార్థాన్ని మరలా అగ్నిలో కాల్చితే తెల్లని బూడిద వస్తుంది. తెల్లని బూడిదని మరలా ఎన్నిమార్లు కాల్చినా అది తెల్లగానే ఉంటుంది. అది తన స్వరూపమును కోల్పోదు. కాబట్టి తెల్లనిది శాశ్వతమైనది. నల్లనిది దాని సామీప్యమునున్నది. విజ్ఞానశాస్త్రం వజ్రం మరియు బొగ్గు ఒక్కటే అని చెప్తుంది. తెలుపు మరియు నలుపు ప్రాథమిక రంగుల్లో పేర్కొనబడలేదు. కాబట్టి తెలుపు నలుపు రంగులు కాదు.
ప్రాథమిక రంగుల్లో ఉన్న పదార్థాలను అగ్నిచేత కాల్చినప్పుడు అవి మొదట నల్లగాను తదుపరి తెల్లని బూడిదగాను మారుతాయి. భౌతిక ప్రపంచంలోను, ఆధ్యాత్మిక ప్రపంచంలోను చిట్టచివరి సత్యమైన శివుడు తెల్లనివాడు. అతనికి సామీప్యమునున్న పార్వతీ స్వరూపమైన కాళీ దేవి నల్లనిది. ‘ఇ’ కారం శక్తి స్వరూపం. మనం అందరం శివస్వరూపులం. ఈ శివునిలో ఉన్న ‘ఇ’ కారం అంటే కదలికకు ప్రతీక అయిన అమ్మవారు వెళ్ళిపోతే, మిగిలేది ‘శవ’ం. మన కర్మలను జ్ఞానాగ్నిలో కాల్చితే చివరికి మిగిలే తెల్లని పదార్థం శివుడే(సత్యమే). అదే విభూతి.
భౌతిక ప్రపంచంలోని ఈ విభూతి ఆధ్యాత్మిక ప్రపంచంలోని శివుడే. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం శరీరములకు విభూతి పూసుకుంటాము. భస్మధారణ వల్ల ఈ ప్రాపంచికము అంతా చివరికి బూడిద అవుతుందని, అని ఆ బూడిదే సత్యమని తెలియబడుచున్నది. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది చివరికి మిగిలేది బూడిద(విభూతి) మాత్రమే.
_/\_ శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే _/\_
No comments:
Post a Comment