తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసము, కార్యాలయము, సమావేశమందిరంతో కూడిన భవన సముదాయానికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం ఉదయం పంజాగుట్టలో (ప్రస్తుత క్యాంపు కార్యాలయం పక్కన) శంఖుస్థాపన చేశారు. అత్యంత నిరాడంబరంగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఆర్ అండ్ బి శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుతమున్న క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకోవడానికి, సందర్శకులను కలుసుకోవడానికి అనువుగా లేనందున కొత్త కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత జూబ్లీహాల్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిర్వహణ కోసం కేటాయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా, ఇతర ముఖ్య సమావేశాలు జరుపుకోలవాలన్నా అనువైన సమావేశ మందిరమే లేదు. కలెక్టర్ల కాన్ఫరెన్సును హోటళ్లలో పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించుకోవాలంటే జెఎన్టీయూకో, అగ్రికల్చర్ యూనివర్సిటీకో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిషన్ కాకతీయ సమావేశం జెఎన్టీయూలో, మిషన్ భగీరథ సమావేశం అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెట్టుకోవాల్సి వచ్చింది. క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నప్పుడు మంత్రులు భోజనాలు చేయడనికి బయట హోటల్ కు వెళ్తున్నారు. వీటన్నిటికి ఉపయోగపడే సమావేశ హాలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో గానీ, సెక్రటేరియట్లో కానీ లేకపోవడమే ఈ దుస్థితికి కారణం.
ముఖ్యమంత్రి కూడా తన అధికారిక నివాసంలో ప్రతీ రోజు సమీక్షలు నిర్వహిస్తారు. విధాన నిర్ణయాలు చేయడం కోసం, పరిపాలన సమన్వయం కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. దీనికోసం కూడా ఎంసిఆర్ హెచ్ఆర్డీకో మరో చోటుకో వెళ్లాల్సి వస్తున్నది. ఇక ముఖ్యమంత్రిని కలవడానికి నిత్యం వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశ, విదేశ ప్రముఖులు వస్తారు. కానీ వారి కార్లు కూడా క్యాంపు కార్యాలయంలో పార్కు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంపు కార్యలయంలో ఒక్క ముఖ్యమంత్రి కారు తప్ప మిగతా కార్లు పట్టవు. మిగతా కార్లన్నీ రోడ్డుపై ఉండాల్సి వస్తున్నది. ఓ ఐదొందల మంది ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే వారికి నిలువ నీడ కూడా ఉండడం లేదు. ఫలితంగా సందర్శకులను కూడా ముఖ్యమంత్రి కలవలేకపోతున్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిత్యం సమావేశాలు పెట్టుకోవడానికి వీలుగా, కనీసం వెయ్యి మంది పట్టే సమావేశ మందిరంతో కూడిన ముఖ్యమంత్రి అధికారిక నివాసం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆర్ అండ్ బి శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసము, కార్యాలయము, సమావేశ మందిరం ఉండే విధంగా పంజాగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. నిజాం రాజులు హైదరాబాద్ కు లక్షల ఎకరాల భూమిని వదిలి పోతే, కనీసం ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించుకోవడానికి చాలినంత స్థలం లేని విధంగా పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న భూమిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి అధికారిక నివాస సముదాయానికి శనివారం శంఖుస్థాపన జరిగింది.
No comments:
Post a Comment