ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కధ చదవాల్సిందే. మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పరమత సహనం లేని చక్రవర్తి. అతని పాలనలో పరమతస్థులను ఎన్నో భరించలేని బాధలకు, కష్టాలకూ గురి చేసేవాడు. అతని ఆదేశం ప్రకారం ఇస్లాం మతం స్వీకరించడానికి నిరాకరించి, సహసోపేతంగా ఎదుర్కొన్న సిక్కుమత గురువు తేజ్ బహాదూర్ ను కౄరంగా హత్య చేయించాడు. అంతటితో ఆగక ఆయన మృతదేహానికి చేయవలసిన అంత్యక్రియలు కూడా జరుగకూడదనీ, కుళ్లి మట్టిలో కలిసిపోవలసిందే తప్ప ఎవరూ ముట్టడానికి వీలులేదనీ, ముట్టుకున్న వారికి మరణదండనేననీ ఉత్తరువులు జారీ చేసాడు.
గురు తేజ్ బహాదూర్ సింగ్ కుమారుడైన గురు గోవింద సింగ్ కు అప్పుడు పద్నాలుగేళ్లు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని పంజాబ్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. క్రూరుడైన ఔరంగజేబ్ ను ఎదుర్కొని నిలబడితే గోవింద్ సింగ్ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందనీ అందరూ ఎంత సర్దిచెప్పినా ఆయన వినిపించుకోలేదు.
ఢిల్లీ నగరాన్ని చేరడానికి ఇంకా కొన్ని మైళ్ళు ఉండగానే సిక్కు మతానికి చెందిన ఒక గుర్రపు బండి నడిపేవాడు, అతని కుమారుడు భాయిజైతా, గురుగోవింద్ సింగ్ ను చుసారు. వారిద్దరూ బ్రతిమిలాడడంతో ఆయన అక్కడ గోప్యంగా ఉండడానికి సమ్మతించారు. తను, తన కుమారుడూ ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీ గురుదేవుని దేహాన్ని తెచ్చి ఇస్తామనీ ఆ బండివాడు గురుగోవింద్ సింగ్ కు ప్రమాణం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు.
తండ్రీ కొడుకులు ఢిల్లీ చేరుకున్నారు. గురు తేజ్ బహదూర్ దేహం ఉన్న చోటు కనుగొని ఆ చోటుకి చేరారు. కావలివారు ఏమరపాటులో ఉండడంతో అక్కడికి వెళ్ళడం వారికి సులభం అయ్యింది. అప్పుడు తండ్రి కొడుకుతో "నాయనా! మన ఇద్దరిలో ఎవరైనా ఒకరు కచ్చితంగా ప్రాణాలు కోల్పోవాలి. ఎందుకంటే ఈ దేహాన్ని అపహరిస్తే ఆ చోట మరో దేహాన్ని ఉంచక తప్పదు. లేకపోతే దేహం అపహరించబడిందని అందరికీ తెలిసిపోతుంది. దాంతో, గురు గోవింద్ సింగ్ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. నీకు దేహ దారుఢ్యం వుంది, గురుదేవుని దేహన్ని సురక్షితంగా తీసుకువెళ్లగలిగే సమర్ధుడివి. కాబట్టి నేను మరణిస్తాను" అంటూనే తన కత్తితో పొడుచుకుని మరణించాడు. కుమారుడు తండ్రి మృతదేహాన్ని గురు తేజ్ బహదూర్ శరీరం ఉన్న చోట ఉంచి, ఆయన శరీరాన్ని మోసుకుంటూ గురు గోవింద్ సింగ్ వద్దకు చేరుకున్నాడు భాయిజైతా.
No comments:
Post a Comment